ఇరాన్- ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు రోజురోజుకీ పెరుగుతున్న నేపథ్యంలో అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు భారీగా పెరిగాయి. ప్రపంచవ్యాప్తంగా ఈ ప్రభావం కనిపిస్తుండగా, చమురు ధరలు ఒక్కసారిగా బ్యారెల్కు 100 డాలర్లను దాటడం గమనార్హం. అయితే అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు పెరిగినా, దేశీయంగా ఇంధన ధరల విషయంలో మాత్రం పెద్దగా ఆందోళన అవసరం లేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. మార్చి 15న దేశంలోని ప్రధాన మెట్రోపాలిటన్ నగరాలలో పెట్రోల్, డీజిల్ ధరల్లో స్వల్ప మార్పులు నమోదయ్యాయి. కొన్ని నగరాలలో ధరలు తగ్గగా, మరికొన్ని నగరాలలో స్వల్పంగా పెరుగుదల కనిపించింది. అయినప్పటికీ దేశ రాజధాని ఢిల్లీని మినహాయిస్తే మిగతా మూడు మెట్రోపాలిటన్ నగరాలలో పెట్రోల్ ధర లీటరుకు రూ.100 కంటే ఎక్కువగానే కొనసాగుతోంది. డీజిల్ ధరలు కూడా చాలా చోట్ల రూ.90కు పైగా ఉండటం గమనార్హం.
ఇదిలావుంటే ఇటీవల అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు పెరిగినప్పటికీ దేశంలో ఇంధన సరఫరాపై ఎటువంటి ప్రభావం పడదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ముఖ్యంగా హార్ముజ్ జలసంధి ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు ఉన్నప్పటికీ సరఫరాలో ఎటువంటి అంతరాయం ఏర్పడలేదని అధికారులు తెలిపారు. దేశంలో పెట్రోల్, డీజిల్ నిల్వలు సరిపడా ఉన్నాయని, రాబోయే రోజుల్లో ఇంధన సంక్షోభం వచ్చే పరిస్థితులు లేవని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. అంతర్జాతీయ పరిస్థితులు మారినా దేశీయ సరఫరా వ్యవస్థ బలంగా ఉందని ప్రభుత్వం తెలిపింది.
దేశ రాజధాని ఢిల్లీ విషయానికి వస్తే అక్కడ ఇంధన ధరల్లో ఎటువంటి మార్పు చోటుచేసుకోలేదు. చమురు సంస్థల వివరాల ప్రకారం ఢిల్లీలో పెట్రోల్ ధర లీటరుకు రూ.94.77గా కొనసాగుతుండగా డీజిల్ ధర లీటరుకు రూ.87.67గా ఉంది. ముఖ్యంగా దేశంలోని నాలుగు మెట్రోపాలిటన్ నగరాలలో పెట్రోల్ ధర రూ.100 కంటే తక్కువగా, డీజిల్ ధర రూ.90 కంటే తక్కువగా ఉన్న ఏకైక నగరం ఢిల్లీ కావడం విశేషం. మరోవైపు దేశ ఆర్థిక రాజధానిగా గుర్తింపు పొందిన ముంబైలో కూడా ధరల్లో ఎటువంటి మార్పు నమోదు కాలేదు. ముంబైలో పెట్రోల్ ధర లీటరుకు రూ.103.54గా ఉండగా డీజిల్ ధర లీటరుకు రూ.90.03గా కొనసాగుతోంది.
ఇక కోల్కతా నగరంలో పెట్రోల్ ధరల్లో స్వల్ప పెరుగుదల కనిపించింది. చమురు సంస్థల తాజా గణాంకాల ప్రకారం మార్చి 15న అక్కడ పెట్రోల్ ధర రూ.105.41 నుండి రూ.105.45కు పెరిగింది. అంటే లీటరుకు 5 పైసల పెరుగుదల నమోదైంది. అయితే డీజిల్ ధర మాత్రం మారకుండా లీటరుకు రూ.92.02 వద్దనే కొనసాగుతోంది. మరోవైపు దక్షిణ భారతదేశంలో ముఖ్య నగరంగా ఉన్న చెన్నైలో మాత్రం వినియోగదారులకు కొంత ఉపశమనం లభించింది. అక్కడ పెట్రోల్ ధరలు లీటరుకు 18 పైసలు తగ్గాయి. దీంతో ధర రూ.100.93 నుండి రూ.100.80కు పడిపోయింది. అదే విధంగా డీజిల్ ధరలు కూడా లీటరుకు 9 పైసలు తగ్గి రూ.92.48 నుండి రూ.92.39కు తగ్గాయి.
తెలంగాణ రాజధాని హైదరాబాద్ విషయానికి వస్తే అక్కడ పెట్రోల్ ధరలు లీటరుకు సుమారు రూ.107.46 వద్ద కొనసాగుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరల్లో భారీ హెచ్చుతగ్గులు ఉన్నప్పటికీ హైదరాబాద్ నగరంలో మాత్రం ధరలు పెద్దగా మారకుండా స్థిరంగా కొనసాగుతున్నాయి. దీంతో వినియోగదారులపై అదనపు భారం పడకుండా పరిస్థితి కొనసాగుతోంది.
ఇదిలావుంటే అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు భారీగా పెరగడం గమనార్హం. ప్రపంచ మార్కెట్ను ప్రభావితం చేసే బ్రెంట్ ముడి చమురు ధర ప్రస్తుతం బ్యారెల్కు 103.14 డాలర్ల వద్ద కొనసాగుతోంది. ముఖ్యంగా ఫిబ్రవరి 26 తర్వాత ఈ ధరలు దాదాపు 45 శాతం వరకు పెరిగాయి. మరోవైపు అమెరికా ముడి చమురు ధర కూడా గణనీయంగా పెరిగింది. తాజా గణాంకాల ప్రకారం బ్యారెల్కు 98.71 డాలర్ల వద్ద ఉంది. ఫిబ్రవరి 26తో పోలిస్తే ఈ ధర దాదాపు 51 శాతం వరకు పెరిగినట్లు తెలుస్తోంది. అంతర్జాతీయ రాజకీయ ఉద్రిక్తతలు, యుద్ధ పరిస్థితులు చమురు మార్కెట్పై తీవ్ర ప్రభావం చూపుతున్నాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అయినప్పటికీ దేశంలో ఇంధన సరఫరా విషయంలో ఎటువంటి ఆందోళన అవసరం లేదని కేంద్ర ప్రభుత్వం మరోసారి స్పష్టం చేసింది.
ALSO READ: ఇరాన్ కొత్త లీడర్ మోజ్తాబా ఖమేనీ నిజంగానే గాయపడ్డారా?
