దేశంలో ప్రతి పౌరుడికి అత్యంత కీలకమైన గుర్తింపు పత్రంగా ఆధార్ కార్డు మారిపోయింది. ప్రభుత్వ పథకాల నుంచి ప్రైవేట్ సేవల వరకు దాదాపు ప్రతి అవసరానికి ఆధార్ తప్పనిసరిగా మారింది. సిమ్ కార్డు తీసుకోవడం నుంచి బ్యాంకింగ్ సేవల వరకు ఎక్కడ చూసినా ఆధార్ అవసరం పడుతున్న నేపథ్యంలో ప్రజలు దీన్ని ఎప్పుడూ తమ వద్ద ఉంచుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే ఇటీవలి కాలంలో ఆధార్ సేవలను మరింత సులభతరం చేయడానికి యూఐడీఏఐ పలు కీలక నిర్ణయాలు తీసుకుంటూ వస్తోంది. ఈ క్రమంలో కార్డు దారులకు ఉపశమనం కలిగించే మరో ముఖ్య ప్రకటనను విడుదల చేసింది.
ఇప్పటి వరకు చాలామంది ఫిజికల్ ఆధార్ కార్డు మాత్రమే చెల్లుబాటు అవుతుందని భావిస్తూ, ఇతర రూపాల్లో ఉన్న ఆధార్ను తిరస్కరించడం వల్ల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో యూఐడీఏఐ స్పష్టత ఇస్తూ ఫోన్లో చూపించే ఆధార్, ఈ-ఆధార్, ఆధార్ లెటర్, ఆధార్ పీవీసీ కార్డు, అలాగే వెబ్సైట్ లేదా యాప్ ద్వారా పొందే డిజిటల్ ఆధార్ అన్నీ సమానంగా చెల్లుబాటు అవుతాయని ప్రకటించింది. అంటే ఫిజికల్ కార్డు లేకపోయినా ఈ డిజిటల్ రూపాలను ధృవీకరణ కోసం ఉపయోగించుకోవచ్చని వెల్లడించింది. ఈ నిర్ణయం వల్ల ప్రజలు ఎప్పుడైనా, ఎక్కడైనా సులభంగా ఆధార్ సేవలను వినియోగించుకునే అవకాశం కలిగింది.
డిజిటల్ సేవలను విస్తరించే దిశగా యూఐడీఏఐ ఇటీవల మరిన్ని మార్పులు తీసుకువచ్చింది. జనవరిలో కొత్త ఆధార్ యాప్ను ప్రవేశపెట్టి, దాని ద్వారా డిజిటల్ ధృవీకరణను మరింత సులభతరం చేసింది. ఇకపై ఎక్కడైనా ఆధార్ అవసరం ఉన్నప్పుడు తప్పనిసరిగా ఫిజికల్ కార్డు తీసుకెళ్లాల్సిన అవసరం లేకుండా, మొబైల్లోనే డిజిటల్ కాపీ చూపించి ధృవీకరణ పూర్తి చేసుకోవచ్చు. దీంతో సమయం ఆదా కావడంతో పాటు ప్రజలకు సౌలభ్యం పెరిగింది.
అదే విధంగా ఈ యాప్లో అనేక కొత్త సదుపాయాలను కూడా అందుబాటులోకి తీసుకువచ్చారు. మొబైల్ నెంబర్ మార్పు, చిరునామా సవరణ వంటి సేవలను ఇప్పుడు చాలా సులభంగా యాప్ ద్వారానే పూర్తి చేసుకోవచ్చు. ఇంతకు ముందు ఈ పనుల కోసం ఆధార్ కేంద్రాలకు వెళ్లి గంటల తరబడి క్యూలో నిలబడాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు కొన్ని క్షణాల్లోనే ఈ మార్పులు చేసుకునే అవకాశం కలిగింది. ఈ మార్పులతో ఆధార్ సేవలు మరింత ప్రజలకు దగ్గరవుతూ, డిజిటల్ విధానంలో వేగంగా అభివృద్ధి చెందుతున్నాయి. యాప్ వినియోగం పెరుగుతున్న నేపథ్యంలో భవిష్యత్తులో మరిన్ని సేవలు అందుబాటులోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ALSO READ: ఇరాన్కు అండగా రష్యా?.. వరల్డ్ వార్-3 వచ్చేసినట్టేనా?
