Anmol Bishnoi NIA Custody: గత కొంత కాలంగా గ్యాంగ్ స్టర్ లారెన్స్ బిష్ణోయ్ బ్యాచ్ దేశ విదేశాల్లో ఎన్నో క్రిమినల్ యాక్టివిటీస్ చేస్తోంది. అందులో లారెన్స్ తప్పుడు అన్మోల్ బిష్ణోయ్ కూడా కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఎన్సీపీ నేత బాబా సిద్ధిఖీ హత్యకేసుతో సహా పలు కేసుల్లో ముఖ్య సూత్రధారి అయిన అన్మోల్ బిష్ణోయ్ ని 11 రోజుల ఎన్ఐఏ కస్టడీకి ఢిల్లీ పాటియాలా హౌస్కోర్టు అప్పగించింది. అన్మోల్ను అమెరికా డిపోర్ట్ చేయడంతో అక్కడి నుంచి భారత్కు తీసుకొచ్చారు. అన్మోల్ను తీసుకువచ్చిన విమానం ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో బుధవారం ఉదయం ల్యాండ్ అయిన వెంటనే అతన్ని ఎన్ఐఏ అదుపులోకి తీసుకుంది. పాటియాలా హౌస్ కోర్టు ముందు హాజరుపరిచింది.
బిష్ణోయ్ క్రైమ్ సిండికేట్లో అన్మోల్ కీలకపాత్ర
బిష్ణోయ్ క్రైమ్ సిండికేట్ లో అన్మోల్ పాత్రను ఎన్ఐఏ తరఫు ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ రాహుల్ త్యాగి కోర్టుకు వివరించారు. ఈ నెట్ వర్క్ లో అన్మోల్ కీలక సభ్యుడని, 2022 నుంచి పరారీలో ఉన్నాడని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం జైలులో ఉన్న లారెన్స్ బిష్ణోయ్ నడుపుతున్న గ్యాంగ్స్టర్ సిండికేట్లో అరెస్టయిన 19వ నిందితుడని తెలిపారు. ట్రెర్రర్ గ్రూప్ ఆపరేషన్లకు అందుతున్న నిధులు, ఇతర సభ్యులను గుర్తించడం సహా విస్తృత స్థాయి సమాచారం వెలికితీసేందుకు అన్మోల్ను కస్టడీలోకి తీసుకుని విచారణ చేయాల్సి ఉంటుందని అన్నారు.
అన్మోల్ మీద 31 కేసులు నమోదు
అటు అన్మోల్ మీద రాజస్థాన్, పంజాబ్, మహారాష్ట్రలో 31 కేసులు నమోదయ్యాయి. ముంబైలో సంచలనం సృష్టించిన బాబా సిద్ధిఖీ హత్య కేసు నిందితులతో అన్మోల్ టచ్ లో ఉన్నట్లు ఎన్ఐఏ గుర్తించింది. 2022లో పంజాబీ గాయకుడు సిద్ధూ మూసేవాలా హత్య కేసులోనూ అతను అభియోగాలను ఎదుర్కొంటున్నాడు. ఆయనపై రూ.10 లక్షల రివార్డును ఎన్ఐఏ ప్రకటించింది. ఈ ఏడాది ప్రారంభంలో అమెరికాలో అన్మోల్ పట్టుబట్టాడు. ఈనెల 18న అతడిని యూఎస్ బహిష్కరించింది. తాజాగా అమెరికా నుంచి ఇండియాకు తీసుకొచ్చారు.





