ఈపీఎఫ్వో ఖాతాదారులకు కేంద్ర ప్రభుత్వం కీలక ఊరటనిచ్చే నిర్ణయం తీసుకుంది. చాలా కాలంగా పీఎఫ్ ఖాతాల్లో నిలిచిపోయిన, క్లెయిమ్ చేయని సొమ్మును పొందడంలో ఎదురవుతున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ఇప్పుడు కొత్త విధానాన్ని అమల్లోకి తీసుకురానుంది. ఈ నిర్ణయం ప్రకారం ఇనాక్టివ్గా మారిన పీఎఫ్ ఖాతాల్లో ఉన్న నిధులను లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాల్లోకి నేరుగా జమ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ప్రక్రియను అమలు చేసేందుకు ఎంప్లాయిస్ ప్రావిడెండ్ ఫండ్ ఆర్గనైజేషన్ ద్వారా చర్యలు చేపడుతున్నారు. దీంతో లక్షలాది ఖాతాదారులకు తమ సొమ్ము సులభంగా అందే అవకాశం ఏర్పడనుంది.
ఇప్పటివరకు పీఎఫ్ ఖాతాలోని డబ్బును పొందాలంటే ఖాతాదారులు తప్పనిసరిగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉండేది. అవసరమైన పత్రాలను సమర్పించిన తర్వాత అధికారుల పరిశీలన అనంతరం మాత్రమే క్లెయిమ్ ప్రక్రియ పూర్తయ్యేది. ఈ విధానం కొంత సమయం తీసుకోవడంతో పాటు అనేక మంది ఖాతాదారులు తమ ఖాతాల్లో ఉన్న సొమ్మును క్లెయిమ్ చేయకుండా వదిలివేసిన సందర్భాలు ఉన్నాయి. అయితే ఇప్పుడు కొత్త విధానం ద్వారా దరఖాస్తు చేయకపోయినా ఇనాక్టివ్ ఖాతాల్లోని డబ్బును ఆటోమేటిక్గా సెటిల్ చేసి నేరుగా బ్యాంక్ ఖాతాల్లో జమ చేయనున్నారు.
ఆధార్తో అనుసంధానం చేసిన బ్యాంక్ ఖాతాల్లో ఈ నిధులను ఆటోమేటిక్గా జమ చేయడం ఈ విధానంలో కీలక అంశంగా నిలుస్తోంది. తొలి దశలో రూ.1000 లోపు బ్యాలెన్స్ ఉన్న ఖాతాలను గుర్తించి పైలట్ ప్రాజెక్టుగా ఈ ప్రక్రియను ప్రారంభించనున్నారు. ఆ తర్వాత క్రమంగా మిగతా ఖాతాదారులకూ ఈ సదుపాయాన్ని విస్తరించనున్నారు. ప్రస్తుతం మొదటి దశలోనే 8 లక్షల ఇనాక్టివ్ ఖాతాలను అధికారులు గుర్తించారు.
ఈ 8 లక్షల ఖాతాల్లో మొత్తం రూ.5200 కోట్ల వరకు నిధులు నిల్వ ఉన్నట్లు వెల్లడైంది. వీటిలో 14 వేల ఖాతాల్లో ఒక్కో ఖాతాలో రూ.5 లక్షలకు పైగా క్లెయిమ్ చేయని సొమ్ము ఉండటం గమనార్హం. అదనంగా మరో 31 లక్షల ఖాతాల్లో సుమారు రూ.10181 కోట్ల వరకు డబ్బు నిరుపయోగంగా ఉందని సమాచారం. ఈ మొత్తం నిధులను దశలవారీగా ఆటోమేషన్ విధానంలో లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాల్లోకి జమ చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.
సాధారణంగా పీఎఫ్ ఖాతాలో మూడేళ్లపాటు ఎలాంటి కాంట్రిబ్యూషన్ జమ కాకపోయినా, ఖాతాదారు క్లెయిమ్ చేయకపోయినా ఆ ఖాతా ఇనాక్టివ్గా మారుతుంది. అలాగే 55 సంవత్సరాల వయస్సులో ఉద్యోగ విరమణ జరిగిన తర్వాత కూడా మూడేళ్ల పాటు డబ్బు జమ కాకపోతే ఖాతా ఇనాక్టివ్గా పరిగణిస్తారు. ఇలాంటి ఖాతాలకు కేంద్ర ప్రభుత్వం వడ్డీ జమ చేయదు. ఈ నేపథ్యంలో కొత్తగా తీసుకొచ్చిన ఆటో సెటిల్మెంట్ విధానం ద్వారా ఖాతాదారులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా తమ సొమ్మును పొందే అవకాశం కలగనుంది.
ALSO READ: రైల్వేశాఖ బిగ్ అలర్ట్.. ఆన్లైన్ రిజర్వేషన్ సేవలు బంద్
