చిత్తూరు, క్రైమ్ మిర్రర్ః చిత్తూరు జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రం కాణిపాకం స్వయంభు శ్రీ వరసిద్ధి వినాయక స్వామి దేవస్థానంలో పాక్షిక కేతుగ్రస్త చంద్రగ్రహణం సందర్భంగా శాస్త్రోక్త నియమాల ప్రకారం ఆలయ దర్శనాలను మంగళవారం ఉదయం మంచి రాత్రి వరకు జరిగే ఆర్జిత సేవలు రద్దు చేసి ఆలయం మూసివేస్తున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు.ఉదయం 6:20 గంటల నుంచి స్వామి వారి సర్వదర్శనం నిలిపివేయనున్నారు.
చంద్రగ్రహణం మధ్యాహ్నం 3:20 గంటలకు స్పర్శ కాలంతో ప్రారంభమై, సాయంత్రం 6:47 గంటలకు మోక్ష కాలంతో ముగియనుంది. శాస్త్రప్రకారం గ్రహణానికి 9 గంటల ముందే ఆలయాన్ని మూసివేయాల్సి ఉండటంతో భక్తులు ముందస్తుగా తమ దర్శనాలను ప్రణాళిక చేసుకోవాలని సూచించారు.
గ్రహణం ముగిసిన వెంటనే సాయంత్రం 6:47 గంటలకు ఆలయ ద్వారాలు తెరచి, ఆలయ శుద్ధి, పుణ్యాహవచనం, అభిషేకం, నివేదన కార్యక్రమాలు ఏకాంతంగా నిర్వహించనున్నారు. అనంతరం 4వ తేదీన ఉదయం సుప్రభాత సేవలతో స్వామివారి దర్శనం యథావిధిగా పునఃప్రారంభమవుతుందని దేవస్థానం స్పష్టం చేసింది. భక్తులు ఈ మార్పులను గమనించి సహకరించాలని అధికారులు కోరారు.
