
-
అమెరికా-ఇండియా మధ్య వాణిజ్య ఉద్రిక్తతలు
-
దిగుమతులపై 50శాతం టారిఫ్లు విధించిన యూఎస్
-
రష్యా నుంచి చమురు కొనుగోళ్లే కారణమని వెల్లడి
-
అమెరికా చర్యలకు భారత్ ధీటైన జవాబు
-
తమకు రైతుల ప్రయోజనాల ముఖ్యమన్న పీఎం
-
నేడు మోదీ అధ్యక్షతన హైలెవల్ కేబినెట్ భేటీ
క్రైమ్ మిర్రర్, న్యూఢిల్లీ: రష్యానుంచి చమురు కొనుగోలు చేస్తుందన్న కారణంతో భారత్పై అమెరికా మండిపడుతోంది. భారత్ దిగుమతులపై సుంకాలను ఏకంగా 50శాతం రెట్టింపు చేస్తూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ నిర్ణయం తీసుకున్నారు. దీంతో భారత్-అమెరికా వాణిజ్య సంబంధాలు ఉద్రిక్తంగా మారాయి. సుంకాల విషయంలో భారత్తో చర్చలు జరిపేది లేదంటూ ట్రంప్ తేల్చిచెప్పారు. ఈ విషయంలో భారత్ కూడా అంతే ధీటుగా ప్రతిస్పందించింది. అమెరికా ఒత్తిళ్లకు లొంగేది లేదని, రైతుల ప్రయోజనాల తమకు ప్రధానమని పీఎం మోదీ స్పష్టం చేశారు. దీంతో ఈ వాణిజ్య పోరు తీవ్రస్థాయికి చేరినట్లయింది.
రష్యా నుంచి భారత్ చమురు కొనుగోలు చేయడాన్ని తాము తీవ్రంగా పరిగణిస్తున్నట్లు ట్రంప్ వెల్లడించారు. ఇది తమ జాతీయ భద్రతకు, విదేశాంగ విధానానికి పెను ప్రమాదంగా భావిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ కారణం చేతనే భారత్పై సుంకాలను రెట్టింపు చేశామన్నారు. రష్యా నుంచి చమురు కొనుగోళ్ల వివాదం పరిష్కారమయ్యే వరకు భారత్తో చర్చలు జరిపేది లేదని ట్రంప్ వెల్లడించారు.
ట్రంప్ వ్యాఖ్యలపై ప్రధాని మోదీ కూడా అంతేస్థాయిలో సమాధానమిచ్చారు. తమకు రైతులు, మత్స్యకారులు, పాడి రైతుల ప్రయోజనాలే ముఖ్యమని వెల్లడించారు మోదీ. ఈ విషయంలో తాము రాజీపడబోమని చెప్పారు. ఈ విషయంలో తాము నష్టపోతామని తెలుసు…. అయినా దానికి భారత్ సిద్ధంగా ఉందని మోదీ చెప్పుకొచ్చారు.
నేడు ప్రధాని మోదీ అత్యున్నతస్థాయి భేటీ
ట్రంప్ టారిఫ్లు, భారత్-అమెరికా మధ్య వాణిజ్య ఉద్రిక్తతల నేపథ్యంలో ప్రధాని మోదీ అత్యున్నత స్థాయి భేటీకి సిద్ధమయ్యారు. ఇవాళ మధ్యాహ్నం ఒంటిగంటకు ప్రధాని మోదీ అధ్యక్షతన హైలెవల్ కేబినెట్ సమావేశం జరగనుంది. ట్రంప్ టారిఫ్లపై భారత్ ఎలా స్పందించాలనేదానిపై సమావేశంలో చర్చించనున్నారు. ఈ భేటీ అనంతరం కీలక ప్రకటన వెలువడే ఛాన్స్ ఉందని సంబంధిత వర్గాలు పేర్కొంటున్నాయి.
Read Also: