Gold Smuggling Case Twist: కన్నడ నటి రన్యా రావుకు సంబంధించిన బంగారం స్మగ్లింగ్ కేసులో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ కేసులో ఆమె పట్టుబడకముందే ఉగాండాకు చెందిన ఓ ఏజెంట్ చేతిలో సుమారు రూ.2 కోట్ల వరకు మోసపోయినట్లు ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) తన చార్జ్ షీట్లో వెల్లడించింది. మనీలాండరింగ్ కేసుకు సంబంధించి ఈడీ బెంగళూరులో ఈ చార్జ్ షీట్ దాఖలు చేసింది.
గత ఏడాది రన్యా రావు అరెస్ట్
గత సంవత్సరం మార్చిలో దుబాయ్ నుంచి బెంగళూరుకు 14 కిలోల బంగారాన్ని అక్రమంగా తీసుకొస్తుండగా, రన్యా రావును విమానాశ్రయంలో అధికారులు అరెస్ట్ చేశారు. ఆ బంగారం విలువ సుమారు రూ.12.56 కోట్లు అని తెలిపారు. ఈ కేసులో దర్యాప్తు కొనసాగించగా మరిన్ని సంచలన విషయాలు బయటపడ్డాయి.
అక్రమంగా 127.28 కిలోల బంగారం రవాణా
2024 మార్చి నుంచి 2025 మార్చి వరకు రన్యా రావు మొత్తం 127.28 కిలోల బంగారాన్ని అక్రమంగా దుబాయ్ నుంచి భారత్కు తరలించినట్లు ఈడీ గుర్తించింది. ఈ బంగారం విలువ దాదాపు రూ.102.55 కోట్లు అని అంచనా వేసింది. దుబాయ్ మార్కెట్లలో లభించే బంగారం ఎక్కువగా ఆఫ్రికా దేశాల నుంచి వస్తుందని తెలుసుకున్న రన్యా, ఆమె సహచరుడు తరుణ్ కొండూరురాజుతో కలిసి ఆఫ్రికా దేశాల ఎగుమతిదారులను సంప్రదించారు.
రన్యాను మోసం చేసిన ఉగాండా ఏజెంట్
ఈ సమయంలో ఉగాండాకు చెందిన బెన్ అనే వ్యక్తి వారితో సంప్రదింపులు జరిపాడు. మొదట అతడు 5 కిలోల బంగారాన్ని సరఫరా చేశాడు. తరువాత 50 కిలోల బంగారం ఇస్తానని చెప్పి ముందుగా పెద్ద మొత్తంలో డబ్బు తీసుకున్నాడు. అయితే డబ్బు తీసుకున్న తర్వాత బంగారం ఇవ్వకుండా మోసం చేశాడు. దీంతో 2024 జనవరి 1న తరుణ్ ఉగాండాకు వెళ్లి బెన్ను కలిశాడు. అక్కడ బెన్ మరింత డబ్బు, అంటే సుమారు రూ.1.70 కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. దాంతో అతని సహచరుడికి డబ్బు పంపించారు. కానీ చివరికి వారు మోసపోయినట్లు తెలుసుకున్నారు. ఈ వ్యవహారానికి సంబంధించిన వాట్సాప్ చాట్ లో చెల్లింపుల ఆధారాలు ఉన్నట్లు ఈడీ తన చార్జ్ షీట్ లో వెల్లడించింది.
