
-
సరోగసీ ముసుగులో చైల్డ్ ట్రాఫికింగ్
-
సృష్టి స్కాంలో విస్తుపోయే నిజాలు
-
ముఠాకు తల్లీకొడుకుల నాయకత్వం
-
ప్రశ్నించిన వారికి బెదిరింపులు, లక్షల్లో ముడుపులు
క్రైమ్ మిర్రర్, హైదరాబాద్: సంతానం కోసం కోటి ఆశలతో వచ్చే దంపతుల స్వప్నాలను సరోగసీ ముసుగులో తుడిచిపెట్టేస్తున్నారు. రాజధాని నగరంలో వెలుగుచూసిన సృష్టి టెస్ట్ ట్యూబ్ సెంటర్ వివాదంలో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. తల్లీకొడుకుల కాంబినేషన్లో సృష్టి ఈ బాగోతమంతా నడుస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.
సృష్టి ఫెర్టిలిటీ సెంటర్లో తాజాగా వెలుగులోకి వచ్చిన దంపతుల డీఎన్ఏ వివాదంలో అసలు సరోగసే జరగలేదని పోలీసులు వెల్లడించారు. వేరే వాళ్ల బిడ్డనుతెచ్చి ఇచ్చి, చైల్డ్ ట్రాఫికింగ్కు పాల్పడ్డారని నిర్థారించారు. ఈ వ్యవహారంలో బాధితుల నుంచి రూ.35లక్షలు వసూలు చేసినట్లు గుర్తించామన్నారు. దీనిపై దర్యాప్తు కొనసాగుతుందని తెలిపారు. సంతానం కోసం వచ్చే దంపతుల ఆశలతో వీళ్లు వ్యాపారం చేస్తున్నారని గుర్తించారు. సృష్టి నిర్వాహకురాలు నమ్రత వద్ద సరోగసి కోసం వచ్చిన దంపతుల వివరాలు ఉన్నట్లు గుర్తించినట్లు పోలీసులు పేర్కొన్నారు. నమ్రత ఆర్థిక లావాదేవీలను పరిశీలిస్తున్నామన్నారు.
సంతానం లేనివారే టార్గెట్
సంతానం కలగని దంపతులే టార్గెట్గా సృష్టి లక్ష్యమని పోలీసులు తేల్చారు. అక్కడకు వెళ్తే ఐవీఎఫ్ సాధ్యం కాదని, సరోగసే మార్గమని, దీనికోసం రూ.30లక్షల వరకు ఖర్చవుతుందని దంపతులను మభ్యపెడతారు. సరోగసీ కోసం వేరే ప్రాంతాల వారిని ఒప్పిస్తామని నమ్మబలుకుతారు. దంపతుల నుంచి అండం, వీర్యం సేకరించి సరోగసీ చేస్తున్నట్టు నమ్మించి లక్షలకు లక్షలు గుంజడం వీరికి వెన్నతో పెట్టిన విద్యని తేల్చారు.
తల్లీ కొడుకులు కలిసి… ముఠాగా ఏర్పడి!
యూనివర్సల్ సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ పేరుతో డా.నమ్రత విజయవాడ, సికింద్రాబాద్, విశాఖపట్టణం, కొండాపూర్లో సెంటర్లు నడుపుతున్నట్టు, వీటిలో పెద్దఎత్తున అక్రమ సరోగసీలు, ఫెర్టిలిటీ స్కామ్లు చేసినట్టు పోలీసులు గుర్తించారు. 1995లో మెడికల్ ప్రాక్టీస్ ప్రారంభించిన నమ్రత 1998లో ఫెర్టిలిటీ సర్వీసెస్లోకి మారారు. ఆ తర్వాత అనైతికంగా, అక్రమంగా ప్రాక్టీస్ చేస్తూ ఒక్కొక్క రోగి నుంచి రూ.20 లక్షల నుంచి రూ.30 లక్షలు వసూలు చేశారు. తమకు పిల్లలు వద్దంటూ అబార్షన్లు చేయించుకోవడానికి ప్రయత్నించే మహిళలతో మాట్లాడి, వారికి డబ్బులు ఆశచూపి శిశువులను తీసుకొచ్చేవారని, ఆ శిశువులను సరోగసీ కోసం వచ్చిన దంపతులకు మోసపూరితంగా అప్పగించేవారని పోలీసుల దర్యాప్తులో తేలింది. సరైన లైసెన్స్ లేకుండా నమ్రత ఐవీఎఫ్ ట్రీట్మెంట్ చేసేవారని, బాధితులు తమకు అన్యాయం జరిగిందని సెంటర్ వద్దకు వచ్చి ప్రశ్నిస్తే, వారిని తన కార్యాలయంతోపాటు నమ్రత ఆర్థిక వ్యవహారాలు చూసుకునే ఆమె కొడుకు, అడ్వకేట్ పచ్చిపాల జయంత్కృష్ణతో బెదిరించేవారని పోలీసుల తేల్చారు.
Read Also: