చిన్ననాటి నుంచి మనకు అలవాటైన మంచి పద్ధతుల్లో నిద్రలేవగానే పక్కబట్టలు సర్దడం ఒకటి. శుభ్రతకు ఇది సంకేతంగా భావిస్తూ చాలా మంది ఈ అలవాటును కచ్చితంగా పాటిస్తుంటారు. అయితే తాజా ఆరోగ్య పరిశోధనలు ఈ అలవాటుపై ఆశ్చర్యకరమైన విషయాలను వెల్లడిస్తున్నాయి. నిద్రలేవగానే వెంటనే బెడ్ సర్దడం వల్ల మనకు తెలియకుండానే కొన్ని ఆరోగ్య సమస్యలకు కారణమవుతుందని నిపుణులు చెబుతున్నారు. మనం నిద్రలో ఉన్న సమయంలో శరీరం నుంచి సహజంగానే చెమట, చర్మ కణాలు బయటకు వస్తాయి. ఇవి పక్కబట్టలపై పేరుకుపోయి తేమను ఏర్పరుస్తాయి. ఈ తేమ సూక్ష్మజీవుల పెరుగుదలకు అనుకూలంగా మారుతుంది. ముఖ్యంగా డస్ట్ మైట్స్ అనే సూక్ష్మ జీవులు ఈ తేమను ఆహారంగా తీసుకుంటూ వేగంగా విస్తరిస్తాయి. మనం నిద్రలేవగానే దుప్పట్లు మడతపెట్టి బెడ్ను సర్దేస్తే, ఆ తేమ బయటకు వెళ్లకుండా లోపలే చిక్కుకుపోతుంది. దీని వల్ల పక్కబట్టలు సూక్ష్మజీవుల పెరుగుదలకు కేంద్రంగా మారే ప్రమాదం ఉంది.
ఇదే సమయంలో నిపుణులు సూచిస్తున్న విధానం భిన్నంగా ఉంది. నిద్రలేవగానే వెంటనే బెడ్ సర్దకుండా కొంతసేపు అలాగే వదిలేయడం ఆరోగ్యానికి మేలు చేస్తుందని చెబుతున్నారు. గదిలోకి గాలి, వెలుతురు సరిగ్గా చేరేలా కిటికీలు తెరిచి ఉంచితే, పక్కబట్టల్లోని తేమ సహజంగా ఆరిపోతుంది. తేమ తగ్గిపోతే డస్ట్ మైట్స్ జీవించలేవు. ఈ విధానం వల్ల తుమ్ములు, జలుబు, చర్మ సమస్యలు వంటి ఇబ్బందులు తగ్గే అవకాశం ఉందని నిపుణులు వివరించారు. ముఖ్యంగా అలెర్జీలతో బాధపడేవారికి ఇది ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని చెబుతున్నారు.
అలాగే నిద్రలేవగానే గదిలో తాజా గాలి ప్రసరణకు ప్రాధాన్యత ఇవ్వడం చాలా అవసరం. కొంతసేపటి తర్వాత, ఉదయం పనులు పూర్తి చేసిన తరువాత బెడ్ సర్దుకోవడం మంచిదని సూచిస్తున్నారు. పక్కబట్టలను వారానికి 1 సారి వేడి నీటితో శుభ్రం చేయడం ద్వారా మరింత రక్షణ పొందవచ్చు. శుభ్రత ఎంత ముఖ్యమో, ఆరోగ్య రక్షణ అంతకంటే ముఖ్యమని నిపుణులు చెబుతున్నారు. అందువల్ల నిద్రలేవగానే వెంటనే బెడ్ సర్దే అలవాటును కొద్దిగా మార్చుకుని, ముందు గాలి, వెలుతురు తగలేలా చూసి తరువాత సర్దుకోవడం ఆరోగ్యానికి మేలైన మార్గమని సూచిస్తున్నారు.
ALSO READ: సిగరెట్ తాగుతూ అడ్డంగా దొరికిపోయిన స్టార్ బౌలర్ (VIDEO)
