తెలుగు సినీ చరిత్రలో కాలం గడిచినా కాంతి కోల్పోని క్లాసిక్ చిత్రాలు చాలా అరుదు. అలాంటి అరుదైన చిత్రాల్లో అగ్రస్థానంలో నిలిచేది పాతాళ భైరవి. జానపద కథా నేపథ్యంలో తెరకెక్కిన ఈ అద్భుత చిత్రం విడుదలై ఇప్పటికే 75 సంవత్సరాలు పూర్తిచేసుకుని వజ్రోత్సవ వేడుకలను జరుపుకోవడం విశేషం. ఎన్నిసార్లు చూసినా కొత్తగా అనిపించే ఈ చిత్రం తెలుగు ప్రేక్షకుల మనసుల్లో చిరస్థాయిగా నిలిచిపోయింది. వెండితెరపై మాయాజాలాన్ని సృష్టించిన ఈ సినిమా, తెలుగు సినీ స్వర్ణయుగానికి ప్రతీకగా నిలిచింది.
విజయా ప్రొడక్షన్స్ పతాకంపై నాగిరెడ్డి, చక్రపాణి నిర్మించిన ఈ చిత్రానికి కె.వి. రెడ్డి దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో ఎన్.టి.రామారావు తోట రాముడిగా చేసిన నటన, ఎస్.వి.రంగారావు పోషించిన నేపాళ మాంత్రికుడి పాత్రలు ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్ర వేశాయి. “సాహసం చేయరా డింబకా.. రాజకుమారి లభిస్తుంది” అనే డైలాగ్ ఇప్పటికీ తెలుగు ప్రజల నిత్యవాడుకలో వినిపిస్తుండటం ఈ సినిమాకు ఉన్న ప్రభావాన్ని తెలియజేస్తుంది.
ఆ కాలంలో ఆధునిక సాంకేతికత లేకపోయినా, ఛాయాగ్రాహకుడు మార్కస్ బార్ట్లే తన కెమెరా పనితీరుతో సృష్టించిన దృశ్యాలు ఇప్పటికీ ఆశ్చర్యానికి గురిచేస్తాయి. పాతాళ భైరవి విగ్రహం, మాంత్రికుడి గుహ, తోట రాముడి సాహస సన్నివేశాలు ప్రేక్షకులను మరో లోకానికి తీసుకెళ్తాయి. ఘంటసాల సంగీతం, పింగళి నాగేంద్రరావు సాహిత్యం ఈ చిత్రాన్ని మరింత శాశ్వతంగా నిలబెట్టాయి. “ఎంత ఘాటు ప్రేమయో”, “ప్రేమ కోసమై వలలో పడెనే” వంటి పాటలు ఇప్పటికీ వినిపిస్తూనే ఉన్నాయి.
ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. ఈ సినిమాకు తొలుత ఎన్.టి. రామారావును ఎంపిక చేయలేదు. ఆ కాలంలో అక్కినేని నాగేశ్వరరావు వరుస విజయాలతో బిజీగా ఉండటంతో తోట రాముడి పాత్రకు ఆయనను అనుకున్నారు. నేపాళ మాంత్రికుడి పాత్రకు గోవిందరాజుల సుబ్బారావును ఎంపిక చేయాలని భావించారు. అయితే కొన్ని కారణాల వల్ల వారు ఈ చిత్రానికి అంగీకరించలేదు. ఇదే సమయంలో ఎన్.టి.రామారావుతో ముందుగానే ఒప్పందం ఉండటంతో ఆయనకు అవకాశం వచ్చింది.
ఇంకా ఒక ఆసక్తికర సంఘటన ఈ ఎంపిక వెనుక ఉంది. ‘సంసారం’ సినిమా షూటింగ్ విరామ సమయంలో ఎన్.టి.రామారావు, అక్కినేని నాగేశ్వరరావు టెన్నిస్ ఆడుతుండగా జరిగిన సంఘటన దర్శకుడు కె.వి.రెడ్డి దృష్టిని ఆకర్షించింది. ఆటలో వరుసగా బంతులు మిస్ అయిన తర్వాత ఎన్.టి. రామారావు చూపించిన పట్టుదల, ఆవేశం చూసి ఆయనలో తోట రాముడి లక్షణాలు ఉన్నాయని గుర్తించారు. వెంటనే ఒక సన్నివేశాన్ని పరీక్షగా చిత్రీకరించి చూసిన తర్వాత “మన తోట రాముడు దొరికేశాడు” అని నిర్ణయించుకున్నారు. ఆ నిర్ణయం తెలుగు సినీ చరిత్రలో ఒక మైలురాయిగా నిలిచింది.
పాతాళ భైరవి కేవలం ఒక సినిమా మాత్రమే కాదు.. అది తెలుగు సినిమా ప్రతిభను ప్రపంచానికి చాటిన అద్భుత కృతి. 75 సంవత్సరాలు గడిచినా ఈ చిత్రం తన మహిమను కోల్పోలేదు. జానపద చిత్రాల గురించి మాట్లాడినప్పుడల్లా ముందుగా గుర్తుకొచ్చే పేరు ఇదే. తెలుగు సినీ చరిత్ర ఉన్నంతకాలం ఈ సినిమా చిరస్థాయిగా వెలుగొందుతూనే ఉంటుంది.
ALSO READ: గ్యాస్ను ఇలా సేవ్ చేయండి..
