రాష్ట్రంలో రైతులు, మహిళల సంక్షేమంపై ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలపై డిప్యూటీ సీఎం చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. రైతు భరోసాతో పాటు వరి ధాన్యానికి అదనపు బోనస్ చెల్లింపుల ద్వారా రైతులకు ప్రత్యక్ష లాభం చేకూర్చుతున్నామని ఆయన వెల్లడించారు. ఇదే సమయంలో ప్రతిపక్ష నేతల విమర్శలకు కూడా ఘాటుగా స్పందించారు.
డిప్యూటీ సీఎం వెల్లడించిన వివరాల ప్రకారం.. రైతు భరోసాకు అదనంగా వరి ధాన్యానికి క్వింటాకు 500 రూపాయల చొప్పున బోనస్ నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేస్తున్నామని తెలిపారు. దీని ద్వారా ఒక్కో రైతుకు సగటున 25000 వరకు లాభం చేకూరుతుందని పేర్కొన్నారు. రైతుల కష్టం గుర్తించి ప్రభుత్వం తీసుకుంటున్న ఈ నిర్ణయం వారికి ఆర్థికంగా బలం చేకూర్చుతుందని వివరించారు. రైతు భరోసా కింద కేవలం తొమ్మిది రోజుల్లోనే 9000 కోట్ల రూపాయలను రైతుల ఖాతాల్లో జమ చేశామని వెల్లడించారు.
మహిళల ఆర్థిక సాధికారతపై కూడా ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందని తెలిపారు. వడ్డీ లేని రుణాల కింద స్వయం సహాయక సంఘాల మహిళలకు ప్రతి ఏడాది 20000 కోట్లకు పైగా నిధులు అందిస్తున్నామని చెప్పారు. ఇప్పటివరకు ఈ పథకం కింద మొత్తం 57000 కోట్ల రూపాయలు మహిళల ఖాతాల్లో జమ చేసినట్లు వివరించారు. మహిళలు ఆర్థికంగా బలపడితే కుటుంబం, తద్వారా రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా ప్రతిపక్ష నేత కేటీఆర్ పై విమర్శలు గుప్పించారు. మహిళల పట్ల గౌరవం గురించి మాట్లాడే ముందు తన వ్యాఖ్యలపై ఆలోచించుకోవాలని సూచించారు. ప్రతి సందర్భంలో మహిళల మనోభావాలను దెబ్బతీసేలా మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు.
కేటీఆర్ అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని ఆరోపిస్తూ, మహిళల అభివృద్ధిపై నిజంగా శ్రద్ధ ఉంటే తమ ప్రభుత్వ కాలంలోనే క్యాబినెట్లో ఎక్కువ అవకాశాలు కల్పించేవారని వ్యాఖ్యానించారు. కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా తీర్చిదిద్దే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోందని, ఎన్ని అడ్డంకులు వచ్చినా వెనక్కి తగ్గబోమని స్పష్టం చేశారు.
మహిళల కోసం అమలు చేస్తున్న పథకాలలో భాగంగా ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని ప్రవేశపెట్టినట్లు తెలిపారు. ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఈ నిర్ణయం తీసుకుని అమలు చేశామని పేర్కొన్నారు. ఈ పథకం కింద బస్సు ఛార్జీలను ప్రభుత్వం ప్రతినెలా ఆర్టీసీకి చెల్లిస్తోందని వివరించారు.
ఇక గృహ నిర్మాణంపై కూడా కీలక ప్రకటనలు చేశారు. గతంలో ఇచ్చిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల హామీ అమలు కాలేదని విమర్శిస్తూ, తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రతి ఇంటికి 5 లక్షల చొప్పున మంజూరు చేసి నిర్మాణ పనులు ప్రారంభించిందన్నారు. మొదటి దశలో ప్రతి నియోజకవర్గంలో 3500 ఇళ్ల చొప్పున మొత్తం 4.50 లక్షల ఇళ్ల నిర్మాణాన్ని చేపట్టామని వెల్లడించారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం కోసం ఒకేసారి 22500 కోట్ల రూపాయలను కేటాయించడం దేశ చరిత్రలోనే ఒక రికార్డు అని పేర్కొన్నారు.
ALSO READ: Telangana Assembly: పెట్టుబడులపై రచ్చ.. కేటీఆర్ వర్సెస్ మంత్రి శ్రీధర్బాబు
