* జనాభా ప్రాతిపదికన లేనట్టే
* ఊపిరి పీల్చుకున్న సౌత్ స్టేట్స్
క్రైమ్ మిర్రర్, సెంట్రల్ డెస్క్: దేశవ్యాప్తంగా ఇప్పుడు నియోజకవర్గాల పునర్విభజన పై పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. పునర్విభజన ప్రక్రియను కేంద్ర ప్రభుత్వం మొదలుపెట్టినట్లు తెలుస్తోంది. ఎన్డీఏ సమావేశంలో దీనిపై స్పష్టతనిచ్చారు బిజెపి పెద్దలు. ఇప్పుడు ఉన్న అసెంబ్లీతో పాటు పార్లమెంట్ స్థానాలను 50% పెంచాలని నిర్ణయం తీసుకున్నారు. అయితే దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలను ఒకే ప్రాతిపదికగా తీసుకొని నియోజకవర్గాల పెంపు ఉంటుందని తాజాగా తెలుస్తోంది. ఈ నిర్ణయంతో దక్షిణాది రాష్ట్రాలు ఊపిరి పీల్చుకున్నాయి. గతంలో జనాభా ప్రాతిపదికన నియోజకవర్గాల పునర్విభజన చేపడుతామని కేంద్ర ప్రభుత్వం లికులు ఇచ్చింది. దీంతో దక్షిణాది రాష్ట్రాల ప్రజాప్రతినిధులు దీనిని వ్యతిరేకించారు. అయితే జనాభాతో పని లేకుండా అన్ని రాష్ట్రాలను ఒకే ప్రాతిపదికగా తీసుకొని నియోజకవర్గాల పెంపు ఉంటుందని తాజాగా తెలియడం ఉపశమనం కలిగించే అంశం.
చివరిగా 2009లో..
చివరిసారిగా 2009లో నియోజకవర్గాల పునర్విభజన జరిగింది. ఎప్పటినుంచో కొత్తగా నియోజకవర్గాల పునర్విభజన చేపట్టాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. వాస్తవానికి 2009లో నియోజకవర్గాల పునర్విభజన చేపట్టారు కానీ.. వాటి సంఖ్యను మాత్రం పెంచలేదు. అయితే దేశ జనాభా గణనీయంగా పెరిగింది. అందుకే నియోజకవర్గాల సంఖ్యను పెంచాలని భావించింది. 2021లో జనాభా లెక్కలు సేకరించి అందుకు అనుగుణంగా నియోజకవర్గాలు పెంచాలని కేంద్ర ప్రతిపాదించినట్లు ప్రచారం సాగింది. ఈ ప్రతిపాదన తెరపైకి వచ్చిన వెంటనే దక్షిణాది రాష్ట్రాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశాయి. పార్టీలకు అతీతంగా వ్యతిరేకించాయి.
ఉత్తరాదిలో పెరిగిన జనాభా..
జనాభా నియంత్రణ నినాదం ఇప్పటిది కాదు. ఆ నినాదాన్ని పక్కగా పాటించింది దక్షిణ భారతదేశం. కానీ ఉత్తరాది రాష్ట్రాల్లో సంతానం విషయంలో నిబంధనలు పాటించలేదు. అందుకే ఉత్తరాది రాష్ట్రాల్లో జనాభా గణనీయంగా పెరిగింది. ఉత్తరాదితో పోల్చుకుంటే దక్షిణాది రాష్ట్రాల్లో జనాభా తక్కువ. అందుకే జనాభా ప్రాతిపదికన నియోజకవర్గాలను పెంచుకుంటూ పోతే ఉత్తరాది రాష్ట్రాల్లోనే ఎక్కువగా పెరిగిపోతాయి. దక్షిణాది రాష్ట్రాల్లో కొత్తగా నియోజకవర్గాలు పెరగక పోగా.. ఉన్నవి తగ్గిపోయే ప్రమాదం ఉంది. అందుకే జనాభా ప్రాతిపదికన నియోజకవర్గాల పెంపు అంశాన్ని దక్షిణాది రాష్ట్రాలు తీవ్రంగా వ్యతిరేకించాయి. అయితే ఇప్పుడు అటువంటి ప్రతిపాదనలేదని స్పష్టత వస్తోంది.
దక్షిణాదిలో అదే స్థాయిలో..
ప్రస్తుతం ఉన్న పార్లమెంటు స్థానాలను మరో 50% పెంచాలన్నది కేంద్ర ప్రభుత్వ ఆలోచనగా తెలుస్తోంది. 50% పెరిగితే లోక్సభ స్థానాలు 816కు పెరిగే ఛాన్స్ ఉంది. అయితే ఉత్తరాది రాష్ట్రాలతో సమానంగా దక్షిణాది రాష్ట్రాల్లో నియోజకవర్గాలు పెరగనున్నాయి. దక్షిణాది ప్రాతినిధ్యం కూడా పెరుగుతుంది. గతం మాదిరిగా ఆలోచన చేస్తున్నట్టు నియోజకవర్గాల పెంపు అనేది జనాభా ప్రాతిపదికన కాకుండా.. దేశవ్యాప్తంగా ఒకే మాదిరిగా పెరిగే ఛాన్స్ ఉంటుంది. ఇది దక్షిణాది రాష్ట్రాలకు ఉపశమనం కలిగించే విషయం.
