
దీన్ దయాల్ ఉపాధ్యాయ జయంతి వేడుకలు
తుర్కయంజాల్, సెప్టెంబర్ 25: దేశ ప్రజల ఐక్యత కోసం పోరాడిన గొప్పనేత పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ అని బీజేపీ సీనియర్ నాయకుడు కందాల బలదేవరెడ్డి అన్నారు. తుర్కయంజాల్ మున్సిపాలిటీ పరిధి రాగన్నగూడలో బీజేపీ మున్సిపల్ అధ్యక్షుడు ఎలిమినేటి నర్సింహారెడ్డి ఆధ్వర్యంలో దీన్ దయాళ్ ఉపాధ్యాయ జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన బలదేవరెడ్డి మాట్లాడుతూ రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ అధ్యక్షుడిగా, భారతీయ జనతా పార్టీ హైందవ సిద్దాంతకర్తగా దీన్ దయాళ్ ఉపాధ్యాయ పనిచేశారని కొనియాడారు. భారతీయ జనతా పార్టీ హైందవ సిద్దాంతానికి పునాదిగా చెప్పబడే ఏకాత్మతా మానవతావాదానికి ఆజ్యం పోశారన్నారు. చిన్నతనం నుంచే దేశం కోసం, ధర్మం కోసం, సనాతన ధర్మ పరిరక్షణ కోసం ఉద్యమించారని తెలిపారు. పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ ఆశయాలను ముందుకు తీసుకెళ్లేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని బలదేవరెడ్డి పిలుపునిచ్చారు. దీన్ దయాళ్ అందించిన అంత్యోదయ ఉద్యమం స్ఫూర్తితో అట్టడుగువర్గాలకు ప్రభుత్వ ఫలాలు అందించేలా కార్యకర్తలు పనిచేయాలన్నారు. ఈ కార్యక్రమంలో సహకార బ్యాంకు వైస్ చైర్మన్ కొత్త రాంరెడ్డి, నాయకులు నోముల కార్తీక్ గౌడ్, మల్లెల ప్రేమ్ సాయి, శ్రీకాంత్ రెడ్డి, రవీందర్ రెడ్డి, నందగిరి సురేష్, గుండా కృష్ణ, ధార వెంకటేశ్, నాగరాజు, దాసు, జ్ఞానేశ్వర్ చారి, శివారెడ్డి తదితరులు పాల్గొన్నారు.