* సరైన గుర్తింపు లేదన్న మనస్థాపంతో డి ఎస్ కుమారుడు
* నిజామాబాద్ జిల్లాలో మారుతున్న రాజకీయ సమీకరణలు
క్రైమ్ మిర్రర్, తెలంగాణ బ్యూరో: కాంగ్రెస్ పార్టీకి మరో సీనియర్ నేత రాజీనామా చేస్తారా? జీవన్ రెడ్డి బాట పడతారా? పూర్తిగా అసంతృప్తితో ఉన్నారా? అందుకే కీలక నిర్ణయం తీసుకున్నారా? ఇంతకీ ఎవరా నేత? అంటే ధర్మపురి సంజయ్. దివంగత నేత ధర్మపురి శ్రీనివాస్ తనయుడు. బిజెపి ఎంపీ ధర్మపురి అరవింద్ సోదరుడు. త్వరలో ఆయన కాంగ్రెస్ కు కటీఫ్ చెబుతారని పొలిటికల్ వర్గాల్లో ప్రచారం నడుస్తోంది.
కాంగ్రెస్ పార్టీలో చెరగని ముద్ర..
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోనే సుదీర్ఘకాలం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా వ్యవహరించారు ధర్మపురి శ్రీనివాస్. ఆయన హయాంలోనే రెండుసార్లు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. అప్పట్లో రాజశేఖర్ రెడ్డి క్యాబినెట్లో కీలక మంత్రిగా కూడా వ్యవహరించారు. 2014 వరకు మంత్రిగా కొనసాగారు. అయితే తెలంగాణ ఏర్పడిన తర్వాత అనివార్య కారణాలతో కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పారు. గులాబీ పార్టీలో చేరి రాజ్యసభ సభ్యుడు అయ్యారు. అక్కడకు కొంత కాలానికి తిరిగి కాంగ్రెస్ పార్టీలో చేరారు. కేవలం కాంగ్రెస్ పార్టీ పై మమకారంతో తిరిగి వస్తున్నానని.. తాను చనిపోతే తనపై కాంగ్రెస్ జెండా కప్పాలంటూ చెప్పిన నాయకుడు ధర్మపురి శ్రీనివాస్. అయితే డీఎస్ వెంట నడిచారు ఆయన తనయుడు సంజయ్. కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతూ వచ్చారు. ఆయన సోదరుడు ధర్మపురి అరవింద్ మాత్రం బిజెపిలో చేరి నిజామాబాద్ ఎంపీ అయ్యారు.. అయితే డిఎస్ మరణించిన సమయంలో పరామర్శించిన కాంగ్రెస్ పెద్దలు సంజయ్ రాజకీయ భవిష్యత్తుకు హామీ ఇచ్చారు. కానీ మొన్నటి ఎన్నికల్లో నిజామాబాద్ అర్బన్ టికెట్ ఆశించారు సంజయ్. కానీ వివిధ సమీకరణలో అవకాశం ఇవ్వలేదు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి మూడేళ్లు సమీపిస్తోంది. కానీ ఎటువంటి నామినేటెడ్ పదవి కూడా కేటాయించలేదు. దీంతో సంజయ్ తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు ప్రచారం నడుస్తోంది. త్వరలో ఆయన కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెబుతారని టాక్ నడుస్తోంది.
గులాబీ పార్టీలో చేరిక..
ధర్మపురి శ్రీనివాస్ అప్పట్లో కాంగ్రెస్ పార్టీపై అసంతృప్తితోనే గుడ్ బై చెప్పారు. అప్పట్లో తండ్రితో పార్టీ సంజయ్ బయటకు వచ్చి గులాబీ పార్టీలో చేరారు. 2023 ఎన్నికల కు ముందు కాంగ్రెస్ లో చేరారు సంజయ్. ఆయనకు పార్టీ టికెట్ ఇవ్వకపోయినా కాంగ్రెస్ పార్టీ మద్దతుగా ప్రచారం చేశారు. ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ విజయం కోసం గట్టిగానే కృషి చేశారు. నిజామాబాద్ కార్పొరేషన్ గెలుపు వెనుక సంజయ్ కృషి ఉంది. వాస్తవానికి నిజామాబాద్ కార్పొరేషన్ తొలి మేయర్ గా కూడా సంజయ్ వ్యవహరించారు. స్థానికంగా విద్యావ్యాప్తగాను ప్రత్యేక గుర్తింపు ఉంది. నిజామాబాద్ జిల్లాకు చెందిన చాలామంది నేతలకు కార్పొరేషన్ పదవులు దక్కాయి. కానీ సంజయ్ విషయంలో మాత్రం కాంగ్రెస్ హై కమాండ్ మొండి చేయి చూపింది. అయితే కాంగ్రెస్ పార్టీలో తనకు సరైన గౌరవం దక్కలేదని సంజయ్ మనస్థాపంతో ఉన్నారట. కాంగ్రెస్ పార్టీకి అవసరమైనప్పుడు తీసుకొని.. ఇప్పుడు ఆయన అవసరం లేదన్నట్టు వ్యవహరించడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారట. అందుకే పార్టీకి గుడ్ బై చెప్పడం మేలన్న నిర్ణయానికి వచ్చినట్లు పొలిటికల్ వర్గాల్లో చర్చి నడుస్తోంది.
హస్తం పార్టీకి నష్టమే..
ఒకవేళ ధర్మపురి సంజయ్ కాంగ్రెస్ పార్టీని నిజామాబాద్ జిల్లాలో ఆ పార్టీకి గట్టి షాక్ తగులుతుంది అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఎందుకంటే ఆ జిల్లాలో ధర్మపురి శ్రీనివాస్ కుటుంబానికి మంచి పేరు ఉంది. అయితే కాంగ్రెస్ పార్టీలో ఉంటే తనకు సరైన గుర్తింపు దక్కదని భావించిన డిఎస్ కుమారుడు ధర్మపురి అరవింద్ బిజెపి బాట పట్టారు. కానీ సంజయ్ మాత్రం తన తండ్రి వెంట నడుస్తూ కాంగ్రెస్ పార్టీలోనే సుదీర్ఘకాలం కొనసాగారు. కాంగ్రెస్ పార్టీని నమ్ముకుంటే ఎటువంటి అవకాశాలు దక్కడం లేదని ఆయన బాధపడుతున్నారట. అందుకే కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెబితేనే తనకు రాజకీయంగా అవకాశాలు దక్కుతాయని భావిస్తున్నారట. హైదరాబాదులో తన ముఖ్య అనుచరులతో పాటు శ్రేయోభిలాషులకు చర్చించి ఒక నిర్ణయం తీసుకునేందుకు సిద్ధపడుతున్నారట. ఒకటి రెండు రోజుల్లో ధర్మపురి సంజయ్ నుంచి కీలక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.
