క్రైమ్ మిర్రర్, ఏపీ బ్యూరో: ఏపీ సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం దిశగా అడుగులు వేస్తున్నారు. కూటమి అధికారంలోకి వచ్చి రెండేళ్లు అవుతున్న తరుణంలో సొంత పార్టీ ఎమ్మెల్యేలపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు. వారి పనితీరుపై మదింపు చేస్తున్నారు. చివరకు ఓ నలుగురు ఎమ్మెల్యేలపై కఠిన చర్యలకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. వారు మారకపోవడంతో మార్చేందుకు సిద్ధపడుతున్నట్లు సమాచారం. వారి అధికారాలకు కత్తెర వేసి.. ప్రత్యామ్నాయంగా అక్కడ ఇన్చార్జిని నియమిస్తారని తెలుస్తోంది. కఠిన చర్యలకు దిగకపోతే.. మిగతావారు దారిలోకి వచ్చే అవకాశం లేదని తెలియడంతోనే ఈ నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం.
ఆది నుంచి హెచ్చరికలు..
టిడిపి కూటమి అధికారంలోకి వచ్చిన నాటి నుంచి పార్టీ ఎమ్మెల్యేలను హెచ్చరిస్తూనే ఉన్నారు చంద్రబాబు. క్రమశిక్షణతో ఉండాలని సూచిస్తూనే ఉన్నారు. కానీ కొంతమంది ఎమ్మెల్యేలు మద్యం, ఇసుక, ల్యాండ్ మాఫియాలతో చేతులు కలిపారు అన్న ఆరోపణలు ఉన్నాయి. అటువంటి వారు ఓ నలభై మంది వరకు ఉన్నట్లు అప్పట్లో గుర్తించారు. వారిని పిలిచి మాట్లాడారు. అయితే అందరి తీరులో మార్పు వచ్చిందని.. ఓ నలుగురు మాత్రం ఇంకా పాత ధోరణితో ఉన్నారని నిఘా వర్గాలు సీఎం చంద్రబాబుకు నివేదించినట్లు తెలుస్తోంది. అయితే ఎమ్మెల్యేలకు ఫైనల్ వార్నింగ్ అయిపోయిందని.. ఇక చర్యలే తరువాయి అన్నట్టు చంద్రబాబు ఆలోచన చేస్తున్నట్లు సమాచారం.
పిలిచి మాట్లాడినా..
ఏపీలో తెలుగుదేశం కూటమి బలం 164 అసెంబ్లీ స్థానాలు. తెలుగుదేశం పార్టీ ఒంటరిగానే 135 స్థానాల్లో విజయం సాధించింది. అయితే చాలామంది ఎమ్మెల్యేల పనితీరుపై ఆదిలోనే విమర్శలు వచ్చాయి. గత అనుభవాల దృష్ట్యా వాటిని కట్టడి చేయకపోతే ఇబ్బంది పరిస్థితులు వస్తాయని చంద్రబాబుకు తెలుసు. అందుకే అటువంటి ఎమ్మెల్యేలను పిలిచి ఎప్పటికప్పుడు మాట్లాడుతూ వచ్చారు.. ఓ 40 మంది పనితీరు బాగాలేదని చెప్పి పిలిచి మాట్లాడారు. అయితే అందులో ఓ నలుగురు వైఖరి ఇప్పటికీ మారలేదని తెలుస్తోంది. ప్రధానంగా రాయలసీమ నుంచి ఒకరు, కోస్తాంధ్ర నుంచి ఇద్దరు, ఉత్తరాంధ్ర నుంచి ఒక్కరి పనితీరు బాగాలేదని నివేదికలు అందుతున్నాయి. నిఘా వర్గాలు వారి అవినీతిని బయట పెడుతున్నాయి. ఈ నేపథ్యంలో వారిని తొలగించి ప్రత్యామ్నాయంగా ఇన్చార్జిని నియమించాలని చంద్రబాబు భావిస్తున్నట్లు సమాచారం. కేవలం ఎమ్మెల్యేను పదవి వరకు ఉంచి.. ప్రత్యామ్నాయ నేతకు ఇంచార్జ్ పదవి ఇచ్చి ప్రోత్సహించాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే ప్రస్తుతం తెలుగుదేశం పార్టీలో ఆ నలుగురు ఎవరు అనే దానిపై లోతుగా చర్చ నడుస్తోంది. చూడాలి మరి ఏం జరుగుతుందో..
