ఆంధ్ర ప్రదేశ్

AP Bus Accident: ఏపీలో ఘోర ప్రమాదం, 10 మంది దుర్మరణం!

ఏపీలో ఘోర ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 10 మంది చనిపోయారు. మరో 20 మంది తీవ్రంగా గాయపడ్డారు.

AP Bus Accident:  అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు మండలం తులసిపాకలు ఘాట్ రోడ్‌లో తెల్లవారు జామున ఘోర బస్సు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 10 మంది మృతి చెందగా.. 20మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ బస్సు ప్రమాదంపై ఎప్పటికప్పుడు అధికారులతో అల్లూరి సీతారామరాజు జిల్లా కలెక్టర్ దినేశ్ కుమార్ సమీక్షిస్తున్నారు.

స్పాట్ లోనే 10 మంది దుర్మరణం

అన్నవరం నుంచి అరకు మీదుగా భద్రాచలం వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగిందన్నారు కలెక్టర్ దినేశ్ కుమార్. తెల్లవారు జామున ఈ ఘటన జరిగినట్లు వెల్లడించారు. బస్సులో ఉన్న వారిలో ఇప్పటి వరకు 10 మంది చనిపోయారని తెలిపారు. మొత్తం 22 మంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారని వివరించారు. మరికొంతమంది పరిస్థితి విషమంగా ఉందని చెప్పుకొచ్చారు.ఈ బస్సు ప్రమాద ఘటనలో మృతుల సంఖ్య పెరిగే అవకాశాలు ఉన్నట్లు అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటి వరకు ఆరుగురు వరకు చిన్న గాయాలతో సురక్షితంగానే ఉన్నారని వివరించారు. అక్కడ ఉన్నటువంటి సబ్ కలెక్టర్‌తో పాటు యంత్రాంగం.. అప్రమత్తమై వెంటనే సహాయక చర్యలు చేపడుతున్నామని కలెక్టర్ దినేశ్ తెలిపారు.  ఈ ఘటనపై ముఖ్యమంత్రి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సహాయక చర్యలు వేగవంత చేయాలని, క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందంచాలని అధికారులకు సూచించారు.

కొనసాగుతున్న సహాయక చర్యలు

కాగా, ఈ ప్రమాదానికి కారణమైన బస్సు చిత్తూరుకు చెందిన ఏవీఎం ట్రాన్స్‌పోర్టుకి చెందినదిగా తెలుస్తోంది. బస్సు ఓనర్ ఏకే రామ్మూర్తి మురుకంబట్టు ప్రాంతానికి చెందిన వాసి. టూర్ ఏజెంట్ వజ్రం అనే వ్యక్తి ద్వారా ఏడు రోజుల పాటు టూరుకు బస్సును బుక్ చేసకున్నారు. ఈనెల ఆరో తేదీన చిత్తూరు నుంచి ఈ బస్సు బయలుదేరింది. ప్రమాద స్థలం దగ్గర భీతావాహ పరిస్థితి నెలకొంది. మృతదేహాలన్నీ రక్తసిక్తం అయ్యాయి. సహాయక చర్యలు ఇంకా కొనసాగుతున్నట్లు అధికారులు తెలిపారు. మరికొద్ది సేపట్లోనే పూర్తవుతాయని తెలిపారు. అటు క్షతగాత్రులను సమీప ఆస్పత్రులకు తరలించినట్లు అధికారులు వెల్లడించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button