
ఆపరేష్ అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏమాత్రం అలసత్వం వహించినా, రోగి ప్రాణాలు పోతాయి. కానీ, కొంత మంది డాక్టర్లు ఇప్పటికీ నిర్లక్ష్యంగానే ఉంటున్నారు. తాజాగా మహిళకు ఆపరేషన్ చేసి కడుపులోనే సూది మర్చిపోయిన ఘటన కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ లో జరిగింది. ఈ ఘటనపై ఉన్నతాధికారులు సీరియస్ అయినట్లు తెలుస్తోంది.
ఇంతకీ అసలు ఏం జరిగిందంటే?
మంచిర్యాల జిల్లాకు చెందిన సౌమ్య, సత్యనారాయణ దంపతులు. రీసెంట్ గా సౌమ్య డెలివరీ కోసం జమ్మికుంటలో తల్లి గారి ఇంటికి వచ్చింది. ఈ నెల 15న ఉదయం పురిటి నొప్పులు వచ్చాయి. తల్లిదండ్రులు ఆమెను డెలివరీ కోసం హుజూరాబాద్ ఏరియా దవాఖానకు తీసుకెళ్లారు. వైద్య పరీక్షల తర్వాత మధ్యాహ్నం 12 గంటల సమయంలో ఆమెకు ఆపరేషన్ చేశారు. ఆమెకు పాప పుట్టింది. అయితే, కుట్లు వేసే సమయంలో దారానికి ఉన్న సూది జారిపోయింది. సిబ్బంది మరో సూదితో కుట్లు వేసినట్లు తెలుస్తోంది. ఆ తర్వాత అనుమానం కలగడంతో ఎక్స్ రే తీయగా, కడుపులోనే ఉన్నట్లు తేలింది. వెంటనే, కుట్లు విప్పి సూదిని తొలిగించినట్లు సమాచారం.
కావాలనే దుష్ప్రచారం
అటు ఈ ఘటనపై హాస్పిటల్ సూపరింటెండెంట్ నారాయణ స్పందించారు. కుట్లు వేసే సమయంలోనే సూది మిస్సయ్యిందని, వెంటనే ఎక్స్ రే తీసి కడుపులో ఉన్న సూది తీసేసినట్లు తెలిపారు. కుట్లు వేయకముందే సూదిని తొలిగించినట్లు వెల్లడించారు. కొందరు వ్యక్తులు ఉద్దేశపూర్వకంగానే ప్రభుత్వ ఆస్పత్రి మీద బురదజల్లే ప్రయత్నం చేస్తున్నట్లు తెలిపారు. చిన్న విషయాన్ని రచ్చ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రోగులు ఎలాంటి భయపడాల్సిన అవసరంల ఏదన్నారు. ప్రస్తుతం తల్లీ బిడ్డ క్షేమంగా ఉన్నట్లు నారాయణరెడ్డి వెల్లడించారు.
Read Also: రేపు, ఎల్లుండి వానలు.. ఏ జిల్లాల్లో కురుస్తాయంటే?