
క్రైమ్ మిర్రర్, న్యూఢిల్లీ :-పేద ఖైదీలకు కేంద్రం మంచి అవకాశం కల్పించింది. జైలు నుండి బయటకు రావడానికి కోర్టు షరతులు విధించిన జరిమానా లేదా బెయిల్ అమౌంట్ చెల్లించలేక పేద ఖైదీలు జైల్లోనే ఉండిపోతున్న సందర్భాలు పెద్ద ఎత్తున ఉన్నాయి. ఇలాంటి వారిని బయటకు తీసేలా కేంద్ర హోంశాఖ కొత్త పథకాన్ని ప్రారంభించింది.
అందులో భాగంగా రాష్ట్రాల హోంశాఖలకు, జైళ్ల శాఖలకు లేఖలు రాసి పథక వివరాలను తెలియజేసింది. ఈ పథకం ప్రకారం జైల్లో ఉన్న రిమాండ్ ఖైదీ లేదా శిక్షిత ఖైదీ జరిమానా మొత్తం ₹40,000 లోపు ఉంటే, జిల్లా కమిటీ కింద సెంట్రల్ నోడల్ ఏజెన్సీ (CNA)కు అర్హుల జాబితాను పంపిస్తుంది. దాంతో CNA ఆ మొత్తాన్ని చెల్లించి ఖైదీకి బెయిల్ సాధ్యమవుతుంది.
₹40,000 పైగా జరిమానా ఉంటే, అది జిల్లా కమిటీ నుంచి రాష్ట్ర కమిటీకి వెళ్లి, అక్కడ పరిశీలించిన తర్వాత కేంద్రానికి సిఫారసు చేస్తారు. అప్పుడు కేంద్రం ఆ మొత్తాన్ని చెల్లిస్తుంది.కేంద్రం మార్గదర్శకాలు కూడా జారీ చేసింది. అయితే, డ్రగ్స్, మనీలాండరింగ్, ఉగ్రవాద చట్టాల కింద కేసులు ఎదుర్కొంటున్న వారికి ఈ పథకం వర్తించదు. ఇందుకు తోడు, రాష్ట్రాలు ఇప్పటికే అర్హుల జాబితాలను సిద్ధం చేయడం మొదలు పెట్టాయి. దీని ద్వారా డబ్బుల్లేక జైల్లో మగ్గిపోతున్న పేద ఖైదీలకు గట్టి ఊరట లభించనుంది.