జాతీయం

ఇంట్లో దేవుళ్ల విగ్రహాలను పెట్టుకోవచ్చా?.. అసలు శాస్త్రాలు ఏం చెబుతున్నాయి?

సనాతన ధర్మంలో మానవుడి ఆత్మోద్ధరణకు మార్గదర్శకంగా రెండు ముఖ్యమైన ఉపాసనా విధానాలను ఏర్పాటు చేశారు.

సనాతన ధర్మంలో మానవుడి ఆత్మోద్ధరణకు మార్గదర్శకంగా రెండు ముఖ్యమైన ఉపాసనా విధానాలను ఏర్పాటు చేశారు. అవి సగుణోపాసన, నిర్గుణోపాసన. ఈ రెండు మార్గాలు భిన్నంగా కనిపించినప్పటికీ లక్ష్యం ఒక్కటే. అది భగవత్ సాక్షాత్కారం. నిర్గుణోపాసన అంటే రూపం లేని పరబ్రహ్మాన్ని ధ్యానిస్తూ, మంత్రోపాసన ద్వారా మనోనేత్రంతో దర్శించే సాధన. ఇది అత్యంత కఠినమైన మార్గం. దీర్ఘకాల సాధన, ఇంద్రియ నిగ్రహం, ఏకాగ్రత వంటి గుణాలు అవసరం. అందువల్ల ఈ మార్గం అందరికీ సాధ్యమయ్యేది కాదు.

అందుకే సనాతన సంప్రదాయంలో సాధారణ గృహస్తులకు సులభంగా అనుసరించదగిన సగుణోపాసన మార్గాన్ని ప్రతిపాదించారు. రూపంతో కూడిన దేవతారాధనను సగుణోపాసనగా పిలుస్తారు. విగ్రహాల రూపంలో దైవాన్ని దర్శిస్తూ, భక్తి శ్రద్ధలతో పూజించడం ఈ మార్గానికి ప్రాణం. ఈ విగ్రహారాధన యథేచ్ఛగా కాకుండా శాస్త్రీయ నియమ నిబంధనల ఆధారంగా సాగాలనే ఉద్దేశంతో నిగమం అయిన వేదాలు, ఆగమ శాస్త్రాలు రూపుదిద్దుకున్నాయి.

ఆగమ శాస్త్రాలు దేవాలయ నిర్మాణం నుంచి దేవతా విగ్రహాల ప్రతిష్ఠ వరకు ప్రతి అంశాన్ని సవివరంగా వివరించాయి. దేవతామూర్తులు ఎలా ఉండాలి, ఎంత ప్రమాణంలో ఉండాలి, ఆయా దేవతలకు సంబంధించిన ద్వారపాలకులు ఎవరు, ఏ దిక్కులో ఏ దేవతను ప్రతిష్ఠించాలి, ఆలయ గోడలపై ఉండే కోష్ట దేవతల స్థానం ఏది అనే అంశాలన్నింటినీ ఆగమాలు శాస్త్రీయంగా నిర్దేశించాయి. అంతేకాకుండా ఏ దేవతను ఏ విధంగా ఆరాధించాలి, ఎలాంటి ఉపచారాలు చేయాలి అనే నియమాలను కూడా స్పష్టంగా తెలియజేశాయి.

గృహస్థులు తమ ఇళ్లలో చేసే గృహదేవతారాధనకు కూడా ప్రత్యేక నియమాలు ఉన్నాయి. ముఖ్యంగా పసిడి, వెండి, రాగి, కంచు, ఇత్తడి, ఇనుము, సీసం వంటి అష్టలోహాలతో తయారైన విగ్రహాలు, అలాగే చెక్క, రాతితో చేసిన విగ్రహాల ఎత్తు బొటనవేలి ప్రమాణం కంటే తక్కువగా ఉండాలని శాస్త్రాలు పేర్కొంటాయి. దీనికి ముఖ్యమైన కారణం ఉంది. అంగుష్ఠ ప్రమాణాన్ని మించి ఉన్న విగ్రహాలను సాధారణ పూజగా కాకుండా ఆవాహన, విసర్జన మంత్రాలతో, నియమబద్ధమైన ఉపచారాలతో పూజించాలి. అలా చేయకుండా పూజిస్తే తగిన ఫలితం దక్కదని శాస్త్ర వచనం.

అయితే ప్రత్యేక పర్వదినాలు, ఉత్సవాలు లేదా ప్రత్యేక అనుష్ఠానాల్లో పెద్ద విగ్రహాలను తాత్కాలికంగా ప్రతిష్ఠించి, ప్రాణప్రతిష్ఠ చేసి, పూజ అనంతరం ఉద్వాసన చేసే సంప్రదాయం కూడా మహర్షులు పేర్కొన్నారు. ఇది శాస్త్రబద్ధమైన విధానం. కానీ నిత్య గృహారాధనలో ఈ విధానం అనుసరించరాదు.

ఇటీవలి కాలంలో ప్లాస్టర్ ఆఫ్ పారిస్, గన్ మెటల్ వంటి ఆధునిక పదార్థాలతో విగ్రహాలను తయారు చేస్తున్నారు. ఇవి అలంకరణకు మాత్రమే ఉపయోగపడతాయి తప్ప శాస్త్రీయ పూజకు అనుకూలం కావని గ్రహించాలి. అలాగే వేదాలు, శాస్త్రాలు, పురాణాల్లో పేర్కొన్న దేవతామూర్తులను మాత్రమే ఆరాధించాలి. లౌకిక కల్పిత రూపాలను పూజించడం శాస్త్ర సమ్మతం కాదు.

భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ స్పష్టంగా శాస్త్ర ప్రామాణ్యాన్ని వివరించారు. కార్యం ఏది, అకార్యం ఏది అనే విషయంలో శాస్త్రమే ప్రమాణమని గీతాచార్యుడు బోధించారు. శ్రుతి, స్మృతి, పురాణాల్లో పేర్కొన్న విధంగా ఆచరిస్తేనే మానవుడు సత్ఫలితాలను పొందగలడు. శాస్త్ర విరుద్ధంగా, స్వేచ్ఛాచార ధోరణిలో ప్రవర్తిస్తే సిద్ధి, సుఖం, పరమగతి లభించవని గీతలో హెచ్చరించారు.

అయితే సగుణోపాసన అయినా, నిర్గుణోపాసన అయినా భగవదారాధనలో ప్రధానంగా కావాల్సింది శ్రద్ధ, భక్తి, విశ్వాసమే. ఆరాధనలో ఉపయోగించే వస్తువుల ఖరీదు, పరిమాణం, వైభవం కంటే కూడా భక్తుడి హృదయంలోని నిష్కళంకమైన ప్రేమే భగవంతుడికి ప్రీతికరం. ఈ విషయాన్ని గీతలోనే శ్రీకృష్ణుడు స్పష్టంగా చెప్పారు. ఒక ఆకైనా, ఒక పువ్వైనా, ఒక ఫలమైనా, స్వచ్ఛమైన నీటైనా భక్తితో సమర్పిస్తే భగవంతుడు ఆనందంగా స్వీకరిస్తాడని ఉపదేశించారు.

అందువల్ల ఈ చరాచర జగత్తుకు కర్త, భర్త, ధర్త, హర్త అయిన పరమాత్మను నిశ్చలమైన మనస్సుతో, నిర్మలమైన బుద్ధితో, పరిపూర్ణమైన విశ్వాసంతో ఆరాధించడమే సనాతన ధర్మం చూపించిన మార్గం. శాస్త్రానుసారంగా నడుస్తూ, భక్తి శ్రద్ధలతో భగవంతుణ్ని సేవిస్తే మానవ జీవితం సార్థకమవుతుందనే సత్యాన్ని ఈ ఉపాసనా తత్త్వం మనకు బోధిస్తోంది.

NOTE: పైన తెలిపిన సమాచారం కేవలం మీ అవగాహన కోసం మాత్రమే. వాటికి క్రైమ్ మిర్రర్ ఎలాంటి బాధ్యత వహించదు.

ALSO READ: రైతులకు రాష్ట్ర ప్రభుత్వం మరో గుడ్‌న్యూస్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button