తాజాగా జరిగిన బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే సంచలన విజయాన్ని అందుకుంది. 243 అసెంబ్లీ స్థానాల్లో 202 సీట్లు దక్కించుకుని రాష్ట్ర చరిత్రలోనే కొత్త రికార్డు సృష్టించింది. తాజాగా బీహార్ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ ఎన్నికల్లో కేవలం 6 సీట్లకే పరిమితమైన కాంగ్రెస్ ఇప్పుడు పూర్తిగా ఖాళీ కానుందనే ప్రచారం బలంగా జరుగుతోంది.
ఎన్డీయేలోకి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు
కాంగ్రెస్ పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఆరుగురూ సామూహికంగా, లేదంటే వారిలో మూడింట రెండు వంతుల మంది అంటే నలుగురు పార్టీకి గుడ్బై చెప్పి, ఎన్డీయేతో జతకట్టే అవకాశాలున్నాయని తెలుస్తోంది. మకర సంక్రాంతి తరువాత ఏ క్షణంలోనైనా ఈ పరిణామాలుంటాయని చెబుతున్నారు. సంక్రాంతి పండుగ సందర్భంగా బీహార్ కాంగ్రెస్ కార్యాలయంలో ‘దహి-చుర’ కార్యక్రమం ఏర్పాటు చేయగా, ఆరుగురు ఎమ్మెల్యేలలో ఒక్కరు కూడా హాజరు కాలేదు. కాంగ్రెస్ అధిష్ఠానం చొరవతో గత వారంలో కూడా కాంగ్రెస్ పార్టీ ఎంజీఎన్ఆర్జీఏ అంశంపై పాట్నాలో సమావేశం నిర్వహించింది. దీనికి ముగ్గురు ఎమ్మెల్యేలు హాజరుకాలేదు. దీంతో కాంగ్రెస్ పార్టీ ఖాళీ కానుందనే ప్రచారానికి మరింత బలం చేకూరుతోంది.
సంక్రాంతి తర్వాత వలసలు
సంక్రాంతి తర్వాత కాంగ్రెస్ నుంచి వలసలు ఉంటాయని, ఆ పార్టీ ఎమ్మెలంతా ఎన్డీయేలో చేరే అవకాశం ఉందని క్యాబినెట్లో ఎల్జేపీ మంత్రి సంజయ్ సింగ్ తెలిపారు. ఈ ఊహాగానాలకు బిహార్ కాంగ్రెస్ అధ్యక్షుడు రాజేష్ రామ్ తోసిపుచ్చారు. ఎన్డీయే నేతలు వదంతులు సృష్టిస్తున్నారని ఆరోపించారు.
బీహార్ ఎమ్మెల్యేల గురించి..
నితీశ్ కుమార్ సారథ్యంలోని జేడీయూ ఇటీవల 85 సీట్లు గెలుచుకోగా, బీజేపీ 89 సీట్లతో అతిపెద్ద పార్టీగా నిలిచింది. ఎన్డీయే పెద్దన్నగా జేడీయూ స్థానాన్ని బీజేపీ దక్కించుకుంది. ప్రస్తుత రాజకీయ పరిణామాల నేపథ్యంలో కాంగ్రెస్కు చెందిన ఆరుగురు ఎమ్మెల్యేలు జేడీయూకు మద్దతుగా నిలిస్తే ఆ పార్టీ సంఖ్యాబలం 91కి చేరుతుంది. ఇదే జరిగితే ఎన్డీయే పెద్దన్న క్రెటిడ్ను జేడీయూ తిరిగి దక్కించుకుంటుంది.





