
కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగం నిర్మించిన మేడిగడ్డ బ్యారేజ్ కుంగుబాటుపై విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్..పూర్తి స్థాయి నివేదికను సోమవారం ప్రభుత్వానికి అందించింది. ఈ బ్యారేజ్ కుంగుబాటుకు కారణమైన ప్రాజెక్ట్ నిర్మాణంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన 17 మంది ఇరిగేషన్ అధికారులపై క్రిమినల్ చర్యలు చేపట్టాలని ప్రభుత్వానికి సూచించింది. ఎల్ అండ్ టి సంస్థపై సైతం క్రిమినల్ చర్యలు చేపట్టాలని ప్రభుత్వానికి సమర్పించిన నివేదికలో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ స్పష్టం చేసింది.
అలాగే ఈ నివేదికలో పలువురు ఈఎన్సీలతోపాటు ప్రస్తుత సీఈలు, ఎస్ఈల పేర్లను సైతం ప్రస్తావించినట్లు తెలుస్తోంది. ఇక 33 మంది ఇంజనీర్లపై పెనాల్టీ వేయాలని ఈ నివేదికలో సూచించింది. ఏడుగురు రిటైర్డ్ ఇంజనీర్లపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. వీరంతా క్షేత్ర స్థాయిలో పూర్తి నిర్లక్ష్యంగా వ్యవహరించారని సదరు నివేదికలో విజిలెన్స్ పేర్కొంది.