Bengaluru Doctor Kritika Reddy Murder Case: బెంగళూరులో జరిగిన డెర్మటాలజిస్ట్ కృతికా రెడ్డి హత్య కేసు గతేడాది దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ కేసులో ఆమె భర్త డాక్టర్ మహేంద్ర రెడ్డి ప్రధాన నిందితుడు. ప్రియురాలి కోసం భార్యను హత్య చేసి, తర్వాత పోలీసుల కళ్లకు చిక్కకుండా తప్పించుకోవాలని ప్రయత్నించాడు. అయితే, చివరకు పోలీసుల దర్యాప్తులో అతడు పట్టుబడి జైలుకెళ్లాడు.
ప్రియురాలికి షాకింగ్ మెసేజెస్
ఈ ఘటన 2025 ఏప్రిల్ 21న జరిగింది. హత్య జరిగిన వెంటనే మహేంద్ర రెడ్డి తన ప్రియురాలు హర్షితకు వరుసగా సందేశాలు పంపాడు. ఒక మెసేజ్లో, “ఇది చూసిన తర్వాత నాతో సంప్రదించవద్దు. పరిస్థితులు సర్దుకున్నాక నేనే మాట్లాడుతాను. పోలీసులు నిన్ను ప్రశ్నిస్తే మనం కేవలం స్నేహితులమని చెప్పు” అని సూచించాడు. మరో సందేశంలో “నా దగ్గర ఎలాంటి ఆధారాలు లేవు, కానీ నేను కృతికను చంపేశాను. త్వరలోనే జైలుకెళ్లాల్సి వస్తుంది” అని పేర్కొన్నాడు. కొన్ని మెసేజ్లలో తన చేసిన పనిపై బాధ కూడా వ్యక్తం చేశాడు.
2024 మేలో వివాహం
కృతికా రెడ్డి, మహేంద్ర రెడ్డికి 2024 మేలో పెళ్లి జరిగింది. ఇద్దరూ బెంగళూరులో ఒకే ఆసుపత్రిలో డాక్టర్లుగా పనిచేసేవారు. ఈ సమయంలో మహేంద్రకు హర్షిత అనే నర్సుతో పరిచయం ఏర్పడి, అది తరువాత సంబంధంగా మారింది. ఈ సంబంధానికి అడ్డుగా ఉందని భావించి, భార్యను హత్య చేసినట్టు పోలీసులు తెలిపారు.
అనస్థీషియా ఇచ్చి హత్య
హత్య రోజున మహేంద్ర తన భార్యకు అనస్థీషియా ఇచ్చి ప్రాణాలు తీశాడు. అనుమానం రాకుండా ఉండేందుకు ప్రియురాలితో సాధారణ కాల్స్ కాకుండా ఆన్లైన్ పేమెంట్ యాప్ల ద్వారా మెసేజ్లు పంపేవాడు. చివరకు పోలీసుల విచారణలో ఈ వివరాలు బయటపడ్డాయి. హత్య జరిగిన ఆరు నెలల తర్వాత, అక్టోబర్లో మహేంద్ర రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసు అప్పట్లో సంచలనం కలిగించింది.
