ఆంధ్రప్రదేశ్లో ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే AP EAPCET 2026 దరఖాస్తు ప్రక్రియపై కీలక అప్డేట్ వెలువడింది. రాష్ట్ర ఉన్నత విద్యా మండలి అభ్యర్థులకు ఊరట కలిగిస్తూ ఆన్లైన్ దరఖాస్తు గడువును మరోసారి పొడిగించింది. ముందుగా ప్రకటించిన ప్రకారం మార్చి 17తో ముగియాల్సిన రిజిస్ట్రేషన్ గడువును ఇప్పుడు మార్చి 24, 2026 వరకు పెంచినట్లు అధికారులు వెల్లడించారు. దీంతో ఎలాంటి ఆలస్య రుసుము లేకుండా అభ్యర్థులు ఈ కొత్త గడువు వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం పొందారు.
ఈ ప్రకటనను జేఎన్టీయూ కాకినాడ విడుదల చేయగా, విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ పరీక్షలో సాధించిన ర్యాంకుల ఆధారంగా 2026-27 విద్యా సంవత్సరానికి రాష్ట్రవ్యాప్తంగా ఉన్న యూనివర్సిటీలు, ప్రైవేట్ అన్ఎయిడెడ్, అనుబంధ ప్రొఫెషనల్ కాలేజీలలో ప్రవేశాలు కల్పించనున్నారు. ప్రతి సంవత్సరం లక్షలాది మంది విద్యార్థులు ఈ పరీక్షకు హాజరవుతుండగా, ఈసారి కూడా పోటీ తీవ్రంగానే ఉండనుంది.
ఈఏపీసెట్ ఆన్లైన్ పరీక్షలు మే 12 నుంచి మే 20 వరకు నిర్వహించనున్నట్లు అధికారులు ఇప్పటికే ప్రకటించారు. ఇంజినీరింగ్ విభాగ పరీక్షలు మే 12, 15, 18 తేదీల్లో జరగనున్నాయి. అగ్రికల్చర్, ఫార్మసీ విభాగాలకు సంబంధించిన పరీక్షలు మే 19, 20 తేదీల్లో నిర్వహించనున్నారు. పరీక్షల అనంతరం మే 23న ప్రాథమిక ఆన్సర్ కీ విడుదల చేసి, అభ్యంతరాల స్వీకరణ అనంతరం జూన్ 1, 2026న ఫలితాలను ప్రకటించేలా షెడ్యూల్ రూపొందించారు.
దరఖాస్తు ప్రక్రియలో భాగంగా అభ్యర్థులకు సవరణ అవకాశం కూడా కల్పించారు. ఏప్రిల్ 11 నుంచి 13 వరకు అప్లికేషన్లో మార్పులు చేసుకునే అవకాశం ఉంటుంది. అలాగే ఏప్రిల్ 28 నుంచి హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకునే అవకాశం కల్పించనున్నారు. ఆలస్యంగా దరఖాస్తు చేయదలచిన వారికి కూడా విడతల వారీగా ఫీజు చెల్లింపుతో అవకాశాన్ని అందించారు. ఇంకా దరఖాస్తు చేయని అభ్యర్థులు ఈ అవకాశాన్ని కోల్పోకుండా వెంటనే అప్లై చేయాలని అధికారులు సూచిస్తున్నారు.
ALSO READ: Walking: ఎవరు? ఎంత నడవాలి?
