
Heavy Rains: ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశాకు ఆనుకుని బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. ఇవి వాయుగుండంగా మారబోతోంది. 24 గంటల్లో ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశా మధ్య తీరం దాటనుంది. దీని ప్రభావంతో నైరుతి రుతుపవనాలు బలపడి బంగాళాఖాతం నుంచి కొస్తాంధ్ర పైకి భారీగా తేమగాలులు వీస్తున్నాయి.
5 జిల్లాలకు రెడ్ అలర్ట్
వాయుగుండం కారణంగా విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, అంబేద్కర్ కోనసీమ, పశ్చిమగోదావరి జిల్లాలతోపాటు యానాంకు విశాఖ తుఫాన్ హెచ్చరిక కేంద్రం రెడ్ అలర్ట్ ప్రకటించింది. మంగళవారం ఉదయం వరకు ఆ జిల్లాలతోపాటు పలు జిల్లాల్లో క్లౌడ్ బరస్ట్ అవుతుందని, మరికొన్ని చోట్ల భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది.
పలు జిల్లాల్లో భారీ వర్షాలు
ఇక ఆదివారం ఉత్తరాంధ్రలో అనేకచోట్ల భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిశాయి ఇవాళ ఉదయం నుంచి రేపు ఉదయం వరకు విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, యానాం, అంబేద్కర్ కోనసీమ, తూర్పు, పశ్చిమగోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, గుంటూరు జిల్లాలో అక్కడక్కడ కుంభవృష్టి, కోస్తాలోని మిగిలిన జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయి. ఇంకా రాయలసీమలోని తిరుపతిలో భారీగా, మిగిలిన జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయి.
మత్స్యకారులకు హెచ్చరికలు
సముద్రం అల్లకల్లోలంగా మారిందని, మత్స్యకారులు చేపల వేటకు వెళ్లరాదని తుఫాన్ హెచ్చరిక కేంద్రం సూచించింది. విశాఖపట్నం, గంగవరం, కాకినాడ, మచిలీపట్నం, నిజాంపట్నం, కృష్టపట్నంలో మూడో నంబరు అలర్ట్ జారీ చేశారు. అల్పపీడనం వాయుగుండంగా మారే అవకాశం ఉన్నందున హోంమంత్రి వంగలపూడి అనిత కలెక్టర్లతో మాట్లాడారు. అత్యవసర సేవల కోసం జిల్లాల్లో కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. అవసరమైతే ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దించాలన్నారు.