* పార్లమెంటులో చట్టబద్ధత బిల్లు.. తాడేపల్లిలో ప్రెస్ మీట్
* రాజధానిగా ‘మావిగాన్’ సూచన
* సొంత పార్టీ శ్రేణులను ఆశ్చర్యపరిచిన వైసిపి అధినేత
* జాతీయస్థాయిలో సైతం చర్చ
క్రైమ్ మిర్రర్, తెలంగాణ బ్యూరో: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీరుపై ఇప్పుడు అంతటా చర్చ నడుస్తోంది. ముఖ్యంగా అమరావతి రాజధాని విషయంలో ఆ పార్టీ తీసుకున్న స్టాండ్ విమర్శలకు గురిచేస్తోంది. ఆది నుంచి అమరావతిపై అదే వ్యతిరేకత కొనసాగుతోంది. గత ఎన్నికల్లో ప్రజలు అమరావతిపై తీర్పు ఇచ్చారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని దారుణంగా ఓడించారు. అయినా ఆ పార్టీ గుణపాఠాలు నేర్చుకోలేదు. ఐదేళ్ల వైసిపి పాలనలో అమరావతి పూర్తిగా నిర్వీర్యం అయింది. అటు మూడు రాజధానులను పట్టాలు ఎక్కించలేకపోయారు జగన్మోహన్ రెడ్డి. రాజధాని లేని రాష్ట్రంగా మార్చేశారు. ఇప్పుడు మరో ప్రతిపాదనతో ముందుకు వచ్చి అమరావతిని వ్యతిరేకిస్తున్నారు. అయితే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తీసుకున్న స్టాండ్.. జగన్మోహన్ రెడ్డి అనుసరిస్తున్న తీరు మాత్రం విమర్శలకు గురవుతోంది.
అమరావతిపై విషం
నిన్ననే పార్లమెంటులో అమరావతికి చట్టబద్ధత కల్పిస్తూ నిర్ణయం తీసుకున్నారు. లోక్సభలో బిల్లు పాస్ అయింది. రాజ్యసభలో సైతం ఆమోదానికి నోచుకుంది. రాష్ట్రపతి సంతకంతో గెజిట్ నోటిఫికేషన్ రానుంది. అయితే ఒకవైపు లోక్ సభలో బిల్లు రాగా.. అదే సమయంలో మీడియాతో మాట్లాడారు జగన్మోహన్ రెడ్డి. మళ్లీ పాత మాటలనే చెబుతూ అమరావతిపై విషం చిమ్మె ప్రయత్నం చేశారు. సొంత రాష్ట్రానికి రాజధాని లేకుండా చేసి తాను పాతాళంలోకి పోయిన ఆయన సిగ్గు తెచ్చుకోలేదు. అమరావతి విషయంలో పాత ఆరోపణలు చేశారు. గంటల తరబడి మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన తాము వస్తే అమరావతిలోనే రాజధాని ఉంచుతాం అని మాత్రం చెప్పలేదు.
కొత్త రాజధాని ప్రతిపాదన..
అయితే అమరావతిని వ్యతిరేకిస్తున్న జగన్మోహన్ రెడ్డి కొత్త రాజధాని ప్రతిపాదన తెచ్చారు. మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు వరకు కొత్త రాజధాని ప్రకటించాలని.. దానికి మావిగన్ అని ఇంగ్లీష్ పేరు పెట్టాలని సూచించారు. మచిలీపట్నంలో మొదటి రెండు అక్షరాలు.. విజయవాడలోని మొదటి రెండు అక్షరాలు.. గుంటూరులోని మొదటి మూడు అక్షరాలతో ఈ పేరు పెట్టాలని సూచించారు. అయితే జగన్మోహన్ రెడ్డి కొత్త రాజధాని డిమాండ్ తో మరోసారి ప్రజలు ఆశ్చర్యానికి గురయ్యారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు సైతం తప్పుపడుతున్నాయి జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యలను. ఇప్పటివరకు రాజధాని విషయంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి చాలా రకాల డ్యామేజ్ జరిగింది. ఇప్పుడు అవి చాలదన్నట్టు కొత్త రాజధాని ప్రతిపాదన చేయడం ఎంతవరకు సమంజసం అన్న ప్రశ్న ఉత్పన్నం అవుతోంది. జగన్మోహన్ రెడ్డి రాజధానులను చాలా చిన్నచూపు చూస్తున్నట్టు కనిపిస్తున్నారు. ముఖ్యంగా విభజిత ఏపీతో ఆయన ఓ ఆట ఆడుకుంటున్నారు. ఆయన తీరుతో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా ఇదేం పిచ్చి అనే వ్యాఖ్యానాలు చేస్తున్నారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. పార్లమెంటులో అమరావతి చట్టబద్ధతపై చర్చ జరుగుతుండగానే జగన్మోహన్ రెడ్డి చేసిన ఈ ఫీట్లు ఆ పార్టీకి డ్యామేజ్ చేసేలా ఉన్నాయి.
జాతీయస్థాయిలో చర్చ..
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తీరుపై ఇప్పుడు జాతీయస్థాయిలో కూడా విస్తృతమైన చర్చ నడుస్తోంది. ఆ పార్టీకి ఒక విధానం అంటూ లేదన్న విమర్శలు ఉన్నాయి. లోక్సభలో అయితే ఇండియా కూటమికి నేతృత్వం వహిస్తున్న కాంగ్రెస్ పార్టీ బిల్లుకు సంపూర్ణ మద్దతు ప్రకటించింది. ఈ రాజకీయ పార్టీ కూడా అమరావతి చట్టబద్ధతను వ్యతిరేకించలేదు. కానీ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మాత్రం ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ సభ నుంచి వాకౌట్ చేసింది. అయితే ఒక విధానం పరమైన నిర్ణయాల విషయంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఒక అజెండా ఉండదన్న అభిప్రాయం జాతీయ పార్టీలో ఉంది. అయితే వైయస్సార్ కాంగ్రెస్ వ్యవహరిస్తున్న తీరుపై ప్రధాని మోడీ సైతం ఆశ్చర్యం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. పార్లమెంటు నిర్ణయాలని జగన్మోహన్ రెడ్డి సవాల్ చేయడం కూడా ప్రధాని దృష్టికి వెళ్లినట్లు సమాచారం. మొత్తానికి అయితే రాజధానుల విషయంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి భారీ డ్యామేజ్ జరుగుతోంది.
