*ఇరాన్ లో యుద్ధం ఉన్నా నో టెన్షన్
*చమురు నిల్వలు ఉన్నట్లు కేంద్రం ప్రకనట
*వ్యవసాయ రంగానికి భరోసా!
పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపుతున్న నేపథ్యంలో, మనదేశంలో కూడా పెట్రోల్, గ్యాస్, ఎరువుల సరఫరాపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా దిగుమతుల్లో అంతరాయం కలిగే అవకాశం ఉందన్న వార్తలు రావడంతో ప్రజల్లో అనుమానాలు పెరిగాయి. అయితే ఈ అంశంపై కేంద్ర ప్రభుత్వం స్పందిస్తూ, ప్రస్తుతం దేశంలో ఇంధన సరఫరాపై ఎలాంటి తక్షణ సమస్య లేదని స్పష్టం చేసింది. పెట్రోల్ ధరలు భారీగా పెరిగే అవకాశాలపై వస్తున్న వార్తలను కూడా ఖండించింది. అవసరమైతే కొంతకాలం పాటు చమురు కంపెనీలు నష్టాలను భరిస్తాయని తెలిపింది.
8 వారాల వరకు సరిపడా ముడి చమురు
కేంద్రం వెల్లడించిన వివరాల ప్రకారం, దేశంలో రాబోయే 6 నుంచి 8 వారాల వరకు సరిపడా ముడి చమురు మరియు శుద్ధి చేసిన పెట్రోల్ నిల్వలు ఉన్నాయి. అలాగే ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ల సరఫరా కూడా ప్రస్తుతం స్థిరంగా ఉందని అధికారులు తెలిపారు. అయితే వినియోగాన్ని సమతుల్యం చేయడానికి గ్యాస్ సిలిండర్ బుకింగ్ వ్యవధిని 21 రోజుల నుంచి 25 రోజులకు పెంచినట్లు కేంద్రం వెల్లడించింది. దేశంలో ఒక సాధారణ కుటుంబం ఏడాదికి సగటున 7 నుంచి 8 సిలిండర్లు మాత్రమే వినియోగిస్తుందని కూడా పేర్కొంది.
వ్యవసాయ రంగానికి ప్రభుత్వం భరోసా
ఇక వ్యవసాయ రంగానికి సంబంధించి కూడా ప్రభుత్వం భరోసా ఇచ్చింది. రాబోయే ఖరీఫ్ సీజన్కు అవసరమైన ఎరువుల నిల్వలు దేశంలో తగినంతగా ఉన్నాయని ఫెర్టిలైజర్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా తెలిపింది. ప్రస్తుతం దేశంలో 177.31 లక్షల టన్నుల ఎరువులు నిల్వలో ఉండగా, వాటిలో 59.30 లక్షల టన్నుల యూరియా, 25.13 లక్షల టన్నుల డీఏపీ, 55.87 లక్షల టన్నుల ఎన్పీకేఎస్ ఉన్నట్లు వెల్లడించింది. అయితే అంతర్జాతీయ ఉద్రిక్తతలు కొనసాగితే భవిష్యత్తులో సరఫరాపై ప్రభావం ఉండొచ్చని నిపుణులు సూచిస్తున్నారు.
