ఢిల్లీ, క్రైమ్ మిర్రర్: అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ యుద్దం రోజు రోజుకు తీవ్రమవుతుంది. క్షిపణులు, డ్రోన్లతో అమెరికా విరుచుకపడుతోంది. తాజా చమురు రవాణకు కీలకంగా ఉన్న హర్మూజ్ జలసంధిని నియంత్రిస్తున్న ఇరాన్ ను అడ్డుకునేందుకు మెరుపు దాడులు చేసింది. ఈ విషయాన్ని అమెరికా సెంట్రల్ కమాండ్ తెలిపింది.
విజయవంతంగా దాడులు చేశాం…ఎక్స్లో పోస్ట్…
“హర్మూజ్ జలసంధికి సమీపంలోని ఇరాన్ క్షిపణి స్థావరాల్లో ఉన్న యాంటీ-షిప్ క్రూజ్ క్షిపణులు.. అంతర్జాతీయ సముద్ర రవాణాకు ముప్పుగా మారాయి. అందుకే ఈ స్థావరాన్ని లక్ష్యంగా చేసుకున్నాం. లోతుగా చొచ్చుకుపోయే 5వేల పౌండ్ల (దాదాపు 2200 కిలోలకు పైమాటే) శక్తిమంతమైన బంకర్ బస్టర్ బాంబుల తో విజయవంతంగా దాడులు చేశాం” అని యూఎస్ సెంట్రల్ కమాండ్ ‘ఎక్స్’ ఖాతాలో వెల్లడించింది.
ఇరాన్ తీర రక్షణ నెట్వర్క్ భాగమైన ఆయుధ నిల్వలు, క్షిపణి ప్రయోగ కేంద్రాలను లక్ష్యంగా చేసుకున్నట్లు అమెరికా తెలిపింది. హర్మూజ్లో చమురు రవాణా నిరంతరాయంగా కొనసాగాలంటే ఈ నెట్వర్ను విచ్ఛిన్నం చేయాల్సిన అవసరం ఉందని అగ్రరాజ్యం భావిస్తోంది. తద్వారా ఈ జలసంధి మార్గంలో వెళ్లే నౌకలపై ఇరాన్ దాడులు చేయకుండా అడ్డుకుంటామని తాజా చర్యతో అమెరికా సంకేతాలిచ్చినట్లయ్యింది.
మిత్రదేశాలు నిరాకరించాయనే కొద్ది గంటల్లోనే దాడులు…
యుద్ధ నౌకలను హర్మూజ్ జల సంధికి పంపడానికి నాటోతో పాటు మిత్ర దేశాలు నిరాకరించాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన కొద్ది గంటల్లోనే ఈ దాడి జరగడం గమనార్హం. సాధారణంగా బంకర్ బస్టర్ బాంబులను భూగర్భంలో ఉండే లక్ష్యాలను ధ్వంసం చేసేందుకు వినియోగిస్తారు. 2022 నాటి నివేదికల ప్రకారం… ఈ బాంబును తయారుచేసేందుకు ఒక్కోదానికి 2.88లక్షల డాలర్లు (భారత కరెన్సీలో దాదాపు రూ.2.6కోట్లు) ఖర్చవుతుందని అంచనా వేశారు.
