
Andhra Pradesh Road Accident: ఆంధ్రప్రదేశ్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. లారీ బోల్తా పడి 9 మంది అక్కడిక్కడే చనిపోయారు. ఈ విషాదకర ఘటన అన్నమయ్య జిల్లాలోని రెడ్డిపల్లె చెరువు కట్ట మీద జరిగింది. ఆదివారం రాత్రి 10 గంటల ప్రాంతంలో రాజంపేట నుంచి రైల్వే కోడూరు మార్కెట్ కు మామిడికాయల లోడుతో వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. లారీ అదుపు తప్పి చెరువు కట్ట మీద బోల్తా పడటంతో లారీలోని 9 మంది కూలీలు చనిపోయారు. మరో 10 మంది కూలీలకు తీవ్రంగా గాయాలయ్యాయి.
బాధితులు రుయా ఆస్పత్రికి తరలింపు
లారీ ప్రమాదంలో గాయపడిన వారిని.. తిరుపతి రుయా ఆస్పత్రికి తరలించారు. వారందరికీ అత్యవసర వైద్యం అందిస్తున్నారు. ప్రత్యేక వైద్య బృందం వారి చికిత్సను పర్యవేక్షిస్తుంది. తొమ్మిది మంది మృతుల్లో ఐదుగురు మహిళలు, నలుగురు పురుషులు ఉన్నారు. మృతులను సబ్బరత్నమ్మ(45), చిట్టెమ్మ(25), గజ్జల లక్ష్మీదేవి (36), రాధ (39), వెంకట సుబ్బమ్మ(37) గజ్జల రమణ(42), మణిచంద్ర(38), గజ్జల దర్గయ్య(32), గజ్జల శీను(33)గా గుర్తించారు. మృతులంతా రైల్వే కోడూరు మండలం సెట్టింగుంట వాసులుగా గుర్తించారు. ఈ ఘటనతో ఆ ప్రాంతం అంతా విషాదకరంగా మారింది.
పోస్టుమార్టం అనంతరం మృతదేహాల అప్పగింత
అటు విషయం తెలియగానే, పోలీసులు స్పాట్ కు చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అటు కుటుంబ సభ్యులకు పోలీసులు సమాచారం అందించారు. వెంటనే కుటుంబ సభ్యలు స్పాట్ కు చేరుకోవడంతో పరిస్థితి హృదయవిదారకంగా మారింది. బాధిత కుటుంబాలు కన్నీరు మున్నీరుగా విలపించారు. చనిపోయిన వారి మృతదేహాలను పోస్టుమార్టం కోసం అన్నమయ్య జిల్లాలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగించనున్నారు.