
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సొంత ఇలాఖాలో దారుణం జరిగింది.80 వేలు అప్పు తీర్చలేదని మహిళను చెట్టుకు తాళ్లతో కట్టేసి చిత్రహింసలు పెట్టాడు కుప్పం టీడీపీ కార్యకర్త. సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో జరిగిన ఈ దారుణ ఘటన కలకలం రేపుతోంది.
చిత్తూరు జిల్లా కుప్పం మండలం నారాయణపురం గ్రామంలో ఈ దారుణం వెలుగు చూసింది. నారాయణపురం గ్రామానికి చెందిన శిరీష వయస్సు (25). ఆమె భర్త తిమ్మరాయప్ప అదే గ్రామానికి చెందిన మునికన్నప్ప వద్ద 3 సంవత్సరాల క్రితం 80,000 వేలు రూపాయలు అప్పు తీసుకున్నారు. అప్పు తీర్చలేక భార్య శిరీష, బిడ్డలను వదిలేసి గ్రామం విడిచి పారిపోయాడు. దీంతో కూలీ పనులు చేసుకుంటూ పిల్లలు పోషించుకుంటుంది శిరీష.
తిమ్మరాయప్ప గ్రామం విడిచిపారిపోయినా అప్పు కోసం భార్య శిరీషపై ఒత్తిడి తెస్తున్నాడు ముని కన్నప్ప. అతని వేధింపులు భరించలేక కూలి చేస్తే వచ్చే డబ్బుల్లో కొన్ని కొన్ని చెల్లిస్తోంది. అయినా సకాలంలో చెల్లించలేదని రోడ్డుపై వెళ్తుండగా అసభ్యకరమైన పదజాలంతో దూషించి తన అప్పు డబ్బులు ఇవ్వకపోతే చంపేస్తానని బెదిరించాడు. శిరీషను ఈడ్చుకొంటూ వెళ్ళి తాడుతో బలవంతంగా వేప చెట్టుకు కట్టేసి కొట్టాడు టీడీపీ కార్యకర్త మునికన్నప్ప. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. సీఎం చంద్రబాబు నియోజకవర్గంలో టీడీపీ కార్యకర్త చేసిన దారుణాన్ని వైసీపీ నేతలు వైరల్ చేస్తున్నారు. చంద్రబాబు కుప్పం నియోజకవర్గంలో ఇలాంటి దారుణ పరిస్థితులు ఉన్నాయని ఆరోపిస్తున్నారు.