
Rains In India: దేశ వ్యాప్తంగా భారీ వర్షాలు బీభత్సం సృష్టించాయి. ఫలితంగా గత 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 25 మంది మృతి చెందారు. పిడుగులు పడటంతో పాటు విద్యుత్ ప్రమాదాలు, నీటిలో మునిగిపోయిన ఘటనల్లో పలువురు చనిపోయారు. యూపీ, ఢీల్లీ, గుజరాత్, మహారాష్ట్ర, హిమాచల్ ప్రదేశ్ లో మృత్యువాత పడ్డారు.
ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి
యూపీలోని బల్లియా జిల్లాలో పిడుగు పడి 13 ఏళ్ల బాలిక చనిపోయింది. బిజ్నోర్ జిల్లాలో మరో బాలిక వర్షం నీటిలో స్నానం చేస్తుండగా డ్రెయిన్ పొంగి కొట్టుకుపోయింది. యమునా నగర్ జిల్లా సోన్ బర్సాలో అర్థరాత్రి సమయంలో పిడుగు పడింది. ఈ ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి చెందారు. అటు గుజరాత్ లోని రాజ్ కోట్, పంచ మహల్ జిల్లాల్లో ఆకస్మికంగా వర్షాలు కురిశాయి. రాజ్ కోట్ జిల్లాలో కరెంటు షాక్ తో ఓ వ్యక్తి చనిపోయాడు. పంచమహల్ జిల్లాలో పిడుగుపడి ఓ ఇంట్లో మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో ఎవరూ ప్రాణాలు కోల్పోకపోయినా, భారీగా ఆస్తినష్టం జరిగింది.
కరెంటు తీగలపై చెట్టుకూలి ఇద్దరు మృతి
అటు ఢిల్లీలో ఈదురుగాలులతో కూడిన వాన పడింది. ఈ నేపథ్యంలో ఓ సెల్ ఫోన్ టవర్ కూలింది. పక్కనే ఉన్న విద్యుత్ తీగలపై ఓ చెట్టు కూలడంతో కరెంట్ షాక్ తగిలి, ఇద్దరు యువకులు ప్రాణాలు కోల్పోయారు. మహారాష్ట్రలో పిడుగులుపడి 8 మంది చనిపోయారు. హిమాచల్ ప్రదేశ్ లో వరుసగా మూడు రోజుల పాటు ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడుతాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఉరుములతో పాటు పిడుగులు పడతాయని హెచ్చరించారు.
Read Also: బ్రిడ్జి కూలి ఆరుగురు మృతి, 25 మంది గల్లంతు!