
Israel-Iran Conflict: ఇజ్రాయెల్- ఇరాన్ మధ్య యుద్ధ మరింత ముదురుతున్న నేపథ్యంలో భారతీయ విద్యార్థులు టెహ్రాన్ నుంచి బయటపడే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే 100 మంది విద్యార్థులు ఇరాన్ నగరం అయిన ఉర్మియాను వదిలి అర్మేనియా సరిహద్దుకు చేరుకున్నారు. అక్కడి నుంచి వారిని తొలి దశలో భాగంగా భారతీయ విదేశాంగశాఖ అధికారులు ప్రత్యేక విమానంలో ఇండియాకు తీసుకురానున్నారు.
ఇరాన్ లో 10 వేల మంది భారతీయులు
ఇరాన్ లో ప్రస్తుతం 10,000 మంది భారతీయులు ఉన్నట్లు విదేశాంగ శాఖ వెల్లడించింది. వీరిలో 6,000 మంది విద్యార్థులు ఉండగా, మిగతా వాళ్లు ఉద్యోగాలు చేస్తున్నట్లు తెలిపింది. ప్రస్తుత ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో భద్రతా కారణాల దృష్ట్యా భారతీయులను ఇండియాకు తీసుకొస్తున్నట్లు తెలిపింది. ఇజ్రాయల్ దాడులతో సుమారు 600 మంది విద్యార్థులను అధికారులు టెహ్రాన్ నుంచి ఖోమ్ నగరానికి తరలించారు. మరికొంత మందిని షిరాజ్, ఇష్ఫాన్ నుంచి యాజ్డ్ సిటీకి తీసుకొచ్చారు.
భారతీయుల భద్రతపై నిరంతర పర్యవేక్షణ
టెహ్రాన్ నుంచి దూరంగా తరలించేందుకు అక్కడి భారత రాయబార కార్యాలయం ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు విదేశాంగశాఖ వెల్లడించింది. భారతీయుల భద్రతను టెహ్రాన్ లోని ఇండియన్ ఎంబసీ ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నట్లు తెలిపింది. ఇరాన్లోని భారతీయుల భద్రతకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించింది. మిగిలిన వారిని కూడా ఇరాన్ లోని సురక్షిత ప్రాంతాలకు తరలించే ఏర్పాట్లు కొనసాగుతున్నాయని తెలిపింది. ఇజ్రాయెల్ జరుపుతున్న దాడులతో టెహ్రాన్ నగరంలోని ఇండియన్ ఎంబసీ ఇప్పటికే అడ్వయిజరీ జారీ చేసింది. అక్కడున్న భారతీయులు టెహ్రాన్ వీడి సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని వెల్లడించింది. భారత ఎంబసీతో టచ్ లో ఉండాలని సూచించింది.
Read Also: ఇజ్రాయెల్ బాంబుల వర్షం.. ఇరాన్ అత్యున్నత సైనిక కమాండర్ మృతి!