తెలంగాణ

మంత్రి కొండా సురేఖను పట్టుకుని కన్నీళ్లు కార్చిన ఉద్యోగులు

తెలంగాణ సచివాలయంలో ఆసక్తికర ఘటన జరిగింది. జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగులు కన్నీళ్లు కార్చారు. మంత్రి కొండా సురేఖను పట్టుకుని కంతటడి పెట్టారు. కొందరు ఉద్యోగులు భావోద్వేగానికి గురయ్యారు. ఈ పరిణామాలతో సచివాలయంలోని మంత్రి కొండా సురేఖ చాంభర్ లో ఉద్వేగ వాతావరణం కనిపించింది. ఉద్యోగుల కన్నీళ్లను తుడుస్తూ వాళ్లకు అభయం ఇచ్చారు మంత్రి కొండా సురేఖ.

తెలంగాణలో సుదీర్ఘ నిరీక్షణకు తెరపడింది. పదోన్నతి కోసం దాదాపు మూడు దశాబ్దాలుగా కళ్ళు కాయలు కాసేలా ఎదురుచూసిన జూనియర్ అసిస్టెంట్స్ కు గ్రేడ్ 3 ఈవోలుగా దేవాదాయ శాఖ ప్రమోషన్ కల్పించింది. జీవో 134 ద్వారా మొత్తం 33 మంది జూనియర్ అసిస్టెంట్ లు ఈవోలుగా పదోన్నతి పొందటంతో వారి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. గత బిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో తీవ్ర అణచివేతకు గురైన తమకు కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వంలో న్యాయం లభించిందని ఉద్యోగులు భావోద్వేగానికి గురైన సన్నివేశాలకు తెలంగాణ సెక్రటేరియట్ వేదికగా నిలిచింది. తమకు దసరా పండుగ వారం రోజులు ముందుగానే వచ్చిందని వారు అమితానందాన్ని వ్యక్తం చేశారు. దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ చేతుల మీదుగా ప్రమోషన్ పత్రాలను అందుకున్నారు. ఈ సందర్భంగా పదోన్నతి పొందిన ఈవోలు మంత్రి కొండా సురేఖను సన్మానించారు.

33 మంది జూనియర్ అసిస్టెంట్లకు గ్రేడ్ 3 ఈవోలుగా తన చేతుల మీదుగా ప్రమోషన్ పత్రాలు అందివ్వడం చాలా ఆనందంగా వుందని మంత్రి కొండా అన్నారు.ఒక్క సంతకంతో వారికి ప్రమోషన్లు కల్పించేందుకు కూడా గత బిఆర్ఎస్ ప్రభుత్వం ఉద్యోగులను తీవ్ర నిర్లక్ష్యాన్ని ప్రదర్శించిందని అన్నారు. ఉద్యోగులకు సంబంధించిన ప్రమోషన్స్ అనేవి సాధారణ ప్రక్రియలో భాగమనీ, అటువంటి ప్రమోషన్స్ ను కూడా చేపట్టకుండా బిఆర్ఎస్ ప్రభుత్వం ఉద్యోగులను మానసికంగా హింసించిందని ఆవేదన వ్యక్తం చేశారు.కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం ప్రజలకు, ఉద్యోగులకు సంబంధించిన ఏ సమస్యనైనా త్వరిత కాలంలోనే పరిష్కరిస్తుందని మంత్రి సురేఖ స్పష్టం చేశారు.

నాడే వారికి ప్రమోషన్స్ వచ్చుంటే వారి సేవలతో దేవాదాయ శాఖ మరింత బలోపేతమయ్యేదనీ, పెండింగ్ సమస్యలకు పరిష్కారం లభించేదని మంత్రి అన్నారు. ఇప్పటికే గ్రేడ్ 1, గ్రేడ్ 2 ఈవోలుగా పలువురికి ప్రభుత్వం ప్రమోషన్లు కల్పించిన విషయాన్ని మంత్రి సురేఖ గుర్తు చేశారు. కొత్త ఈవోలుగా బాధ్యతలు చేపట్టిన ఉద్యోగులు దేవాలయాల అభివృద్ధికి, భక్తుల సౌకర్యాల విషయంలో ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని మంత్రి సూచించారు. దేవాదాయ శాఖ భూముల్లో సౌర విద్యుత్ ఉత్పత్తి, దేవాదాయ భూములకు జీయో ట్యాగింగ్ వంటి నిర్ణయాలతో దేవాదాయ శాఖ ఆస్తులకు కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం కట్టుదిట్టమైన కార్యాచరణతో ముందుకు సాగుతున్నదని అన్నారు. కోర్టు కేసుల్లో వున్న దేవాలయ భూములకు విముక్తి ప్రసాదించేందుకు దేవాదాయ శాఖ లీగల్ ఆఫీసర్ ను నియమించనుందని మంత్రి తెలిపారు.

మంత్రిగారిని ఉద్వేగంతో హత్తుకున్న ఈవో కూతురు

తన తండ్రి ప్రమోషన కోసం యావత్ కుటుంబం కండ్లు కాయలు కాసేలా ఎదురుచూసిందని పదోన్నతి పొందిన ఎఓ ఈవో కూతురు అన్నారు. గత పదేళ్ళుగా తన తండ్రికి ఎప్పుడు ప్రమోషన్ వస్తుందా అంటూ ప్రతి రోజు అడిగేదానన్ని అన్నారు. దశాబ్దాలుగా వేచి చూస్తున్న తన తండ్రికి మీ హయాంలో ప్రమోషన్ రావడం ఎంతో సంతోషాన్నిచ్చిందంటూ భావోద్వేగంతో మంత్రి సురేఖను హత్తుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి సురేఖ ఆమెను భుజం తట్టారు. ఇక నుంచి ఆలయ ఉద్యోగుల సంక్షేమం కోసం ప్రభుత్వం తరఫున చేయాల్సిన కార్యక్రమాలను నిబద్ధతతో చేపడతామని స్పష్టం చేశారు. గత ప్రభుత్వంలో తాము ప్రమోషన్ల విషయంలో తీవ్ర అణచివేతకు గురయ్యామని ఉద్యోగులు చెప్పారు. దేవాదాయ శాఖ కొండా సురేఖ చొరవతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వంలో తమకు న్యాయం లభించిందని ప్రమోషన్ పొందిన పలువురు ఈవోలు ఈ సందర్భంగా ఆనందభాష్పాలు రాల్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button