British MP Bob Blackman On POK: జమ్మూకశ్మీర్ పై బ్రిటన్ ఎంపీ బాబ్ బ్లాక్మన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పాక్ ఆక్రమిత కశ్మీర్ తో సహా జమ్మూకశ్మీర్ మొత్తాన్ని వెంటనే భారత్లో విలీనం చేయాలని అన్నారు. ఆర్టికల్ 370ని రద్దు చేయాలని తాను మూడు దశాబ్దాల క్రితమే చెప్పానని, ఆ పని 1992లో కశ్మీర్ పండిట్ల వలసల కన్నా ముందే చేపట్టాల్సిందని అభిప్రాయం అన్నారు. జైపూర్లో తాజాగా జరిగిన హైటీ కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు.
1990లోనే కాశ్మీర్ పండిట్లకు అన్యాయం జరుగుతుందని చెప్పా!
1990 మొదట్లో కశ్మీర్ పండిట్లు వలసలు వెళ్తున్నప్పుడే తన వైఖరిని స్పష్టం చేసినట్టు చెప్పారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 370వ అధికరణను రద్దు చేస్తామని మేనిఫెస్టోలో పెట్టి అమలు చేయడానికి చాలాకాలం ముందే 1992లో తానే ఈ విషయం ప్రస్తావించానని చెప్పారు. కశ్మీర్ పండిట్లకు తీవ్రం అన్యాయం జరుగుతోందంటూ యూకేలో ఒక సమావేశం కూడా నిర్వహించినట్లు చెప్పారు. మతం, ఇతర కారణాలతో కశ్మీర్ పండిట్లు తమ పూర్వీకుల ఇళ్లు బలవంతంగా వదిలివెళ్లాల్సి రావడాన్ని ఖండించామని బ్లాక్మన్ తెలిపారు.
పీవోకేలో ఉగ్రవాదానికి పాక్ ఊతం
జమ్మూకశ్మీర్లోని ప్రాంతాలను బలవంతంగా ఆక్రమించుకోవడం, పీఓకే ప్రాంతంలో పాకిస్థాన్ ఉగ్రవాదాన్ని విస్తరించడం సరైన చర్య కాదని, ఈ విషయం తాను పదేపదే చెబుతూ వచ్చానని ఎంపీ బాబ్ బ్లాక్మన్ అన్నారు. జమ్మూకశ్మీర్ మొత్తాన్ని భారత్లో విలీనం చేయాలనీ తాను అనేకసార్లు సూచించానని చెప్పారు. అటు పహల్గాం ఉగ్రదాడిని బ్లాక్మన్ ఖండించారు. ఈ దాడిలో 26 మంది ప్రాణాలు కోల్పోవడంపై విచారం వ్యక్తం చేశారు. కొన్నేళ్లుగా జమ్మూకశ్మీర్ లో పరిస్థితులు మొరుగపడటంతో అక్కడ శాంతి నెలకొందని తాము భావించినప్పటికీ పహల్గాం దాడితో ఉగ్ర సమస్య మళ్లీ వెలుగులోకి వచ్చిందన్నారు. ఉగ్రవాదంపై పోరులో భారత్కు ప్రపంచ దేశాలు బాసటగా నిలబడటం ముఖ్యమని చెప్పారు ఎంపీ బ్లాక్మన్.





