First Vande Bharat Sleeper: దేశ ప్రజలు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వందేభారత్ రైలు స్లీపర్ రైలు త్వరలో అందుబాటులోకి రాబోతోంది. ఈ మేరకు కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ కీలక ప్రకటన చేశారు. వందే భారత్ స్లీపర్ కోచ్లతో కూడిన రైలును ప్రధాని మోడీ చేతుల మీదుగా తర్వలో ప్రారంభించనున్నట్లు రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు.
ఫస్ట్ రైలు ఏ రూట్ లో నడుస్తుందంటే?
వందే భారత్ స్లీపర్ రైలుకు సంబంధించి ట్రయల్ రన్ సహా ఇతర పరీక్షలు అన్నీ పూర్తయ్యాయని అశ్విని వైష్ణవ్ తెలిపారు. తొలి స్లీపర్ రైలును గౌహతి-కోల్కతా మధ్య నడపనున్నట్లు వెల్లడించారు. “చాలా రోజులుగా కొత్త జనరేషన్ వందేభారత్ రైళ్ల కోసం ప్రయాణికుల నుంచి డిమాండ్ ఉంది. భారతీయ రైల్వేలో వందేభారత్ చైర్ కార్ రైళ్లతో కొత్త శకం ఆరంభమైంది. ఈ రైళ్లను ప్రజలు కూడా బాగా ఆదరిస్తున్నారు. వేలాది కిలోమీటర్ల దూరం ప్రయాణించే వారిని దృష్టిలో పెట్టుకుని స్లీపర్ కోచ్లతో కూడిన వందేభారత్ రైళ్లను రూపొందించాం. అధునాతన భద్రతా ప్రమాణాలతో అంతర్జాతీయ స్థాయి స్లీపర్ కోచ్లతో ఈ రైళ్లను సిద్ధం చేశాం” అని వైష్ణవ్ వివరించారు.
మధ్య తరగతి ప్రయాణీకులకు అందుబాటులో ధరలు
అటు వందే భారత్ స్లీపర్ రైలు టికెట్ ధరలు కూడా మధ్యతరగతి ప్రయాణికులను దృష్టిలో పెట్టుకుని నిర్ణయిస్తున్నామని తెలిపారు. గౌహతి-హౌరా మధ్య ప్రయాణానికి 3ఏసీ టికెట్ ధర రూ.2300గా ఉండొచ్చని తెలిపారు. దేశంలో తొలి బుల్లెట్ రైలు ట్రైల్ రన్ను 2027 ఆగస్టు 15న నిర్వహిస్తామని వెల్లడించారు. ముందుగా సూరత్-బిలిమోరా మార్గంలో బుల్లెట్ రైలు సిద్ధమవుతుందని ఆయన తెలిపారు.





