
Phone Tapping Case: రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసు ప్రధాన నిందితుడు, ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకరరావు విచారణ ముగిసింది. రెండు రోజుల పాటు ఆయనను ప్రశ్నించిన సిట్ సిట్ అధికారులు, జూన్ 14న మరోసారి విచారణకు రావాలని ఆదేశించారు. జూన్ 9న ప్రభాకర్ రావు తొలిసారి సిట్ విచారణకు హాజరయ్యారు. ఆయనను సుమారు 8 గంటల పాటు ప్రశ్నించి పలు వివరాలు తీసుకున్నారు. మళ్లీ బుధవారం విచారణకు హాజరయ్యారు. రెండోసారి ఏకంగా 9 గంటల పాటు ఆయనను ప్రశ్నించారు. ఈ విచారణలో ఆయన చాలా ప్రశ్నలకు సమాధానాలు దాటవేసినట్లు తెలుస్తోంది. కొన్నింటికి అవి తన వ్యక్తిగతం అంటూ చెప్పలేదని తెలుస్తోంది. మరికొన్ని ప్రశ్నలకు తెలియదు, గుర్తులేదు అని చెప్పినట్లు సమాచారం. సిట్ అధికారులు ఆయన నుంచి చాలా సమాచారాన్ని రాబట్టాలి అనుకున్నప్పటికీ, అనుకున్న స్థాయిలో రాబట్టలేకపోయినట్లు తెలుస్తోంది.
ప్రభాకర్ రావు, ప్రణీత్ రావును కలిపి విచారణ
ఈ కేసులో కీలక నిందితులు అయిన ప్రభాకర్ రావు, ప్రణీత్ రావు నుంచి సిట్ పలువు వివరాలను సేకరించింది. వీరి నుంచి సేకరించిన సమాచారం ఆధారంగా, ఈ నెల 14న ఇద్దరిని కలిపి విచారణ చేయాలని సిట్ అధికారులు భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు సేకరించిన ఆధారాలను వారి ముందు ఉంచి ప్రశ్నించనున్నారు. 2023 అసెంబ్లీ ఎన్నికలు, అంతకు ముందు జరిగిన ఉప ఎన్నికల సమయంలో ఆయన వాడిన సెల్ ఫోన్లను తమకు అప్పటించాలని సిట్ అధికారులు ఆదేశించారు. కానీ, ఇప్పటి వరకు ఆయన ఎలాంటి ఎలక్ట్రానిక్ పరికరాలను సిట్ అధికారులకు అప్పగించలేదు.
పంజాగుట్ట పీఎస్ లో ఫోన్ ట్యాపింగ్ కేసు నమోదు
గత బీఆర్ఎస్ సర్కారు హయాంలో పలు పార్టీల నాయకులు, అధికారుల ఫోన్లను ట్యాప్ చేశారంటూ ప్రభాకర్ రావుపై పంజాగుట్ట పోలీసు స్టేషన్లో కేసు నమోదైంది. ఈ కేసులో ఆయన మొదటి ముద్దాయిగా ఉన్నారు. ఈ కేసు నమోదు అయిన వెంటనే ఆయన అమెరికాకు వెళ్లిపోయారు. ఆయన తిరిగి రాకపోవడంతో పోలీసులు ప్రభాకర్ రావు పాస్ పోర్టు క్యాన్సిల్ చేయించారు. ఈ కేసులో సుప్రీం కోర్టు ఇన్వాల్స్ కావడంతో విచారణకు సహకరించేందుకు ప్రభాకర్ రావు ఓకే చెప్పారు. ఎమర్జెన్సీ ట్రావెల్ డాక్యుమెంట్ తో ఆయన అమెరికా నుంచి ఇండియాకు వచ్చారు. జూన్ 8న హైదరాబాద్ చేరుకున్న ప్రభాకర్ రావు.. జూన్ 9న తొలిసారి విచారణకు హాజరయ్యారు. ఈ కేసులో ఇతర నిందితులుగా ప్రణీత్ రావు, రాధాకిషన్ రావు, భుజంగ రావు, తిరుపతన్న అరెస్ట్ అయ్యారు. వారి సమాచారం ఆధారంగా ప్రభాకర్ రావును ప్రశ్నిస్తున్నారు.
Read Also: ఆధారాలు లేని అభియోగాలు వద్దు, మంగ్లీ ఎమోషనల్ కామెంట్స్!