
ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తవుతుంది. ఈ సందర్భంగా మంత్రివర్గంలో మార్పులు చేయాలని భావిస్తున్నారట చంద్రబాబు. దీంతో.. ప్రస్తుత మంత్రుల్లో టెన్షన్ మొదలైంది. ఎవరి పదవి ఊడుతుందో అని కంగారుపడుతున్నారట మినిస్టర్స్. ముఖ్యంగా ఒక ఉత్తరాంధ్ర మంత్రి పదవి మాత్రం డేంజర్ జోన్ ఉందట. ఆయనకు ఊస్టింగ్ తప్పద్దని ప్రచారం జరుగుతోంది. ఇంతకీ ఎవరా మంత్రి…?
ఏపీ కేబినెట్లో 25 మంత్రి పదవులు ఉండగా… 24 మందిని మాత్రమే తీసుకున్నారు. ఒక పదవి ఖాళీగా ఉంది. ఆ పదవిని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సోదరుడు నాగబాబుకు ఇస్తానని ఇదివరకే హామీ ఇచ్చారు చంద్రబాబు. అది అటుంచితే… కేబినెట్లో ఉన్న ప్రస్తుత మంత్రుల్లో ముగ్గరి పనితీరుపై ముఖ్యమంత్రి చంద్రబాబు అసహనంగా ఉన్నారట. ఆ ముగ్గురిని ఇప్పటికే హెచ్చరించారట సీఎం. పనితీరు మెరుగుపరుచుకోవాలని చెప్పారట. ఇకపోతే… ప్రధానంగా ఉత్తరాంధ్రలో ఒక మంత్రి పనితీరు అస్సలు బాగోలేదని ప్రచారం జరుగుతోంది. ఆయితే ఆ మంత్రి పేరు బయటకు రాకుండా జాగ్రత్త పడుతున్నారు. కానీ.. గోబల్స్ ఊరుకోరు కదా…? చిలవలు.. పలవలు అల్లేస్తున్నారు.
ఉత్తరాంధ్రలో టీడీపీ నుంచి నలుగురు మంత్రులుగా ఉన్నారు. శ్రీకాకుళం నుంచి అచ్చెన్నాయుడు, విజయనగరం నుంచి కొండపల్లి శ్రీనివాస్, గుమ్మడి సంధ్యారాణి, విశాఖ నుంచి వంగలపూడి అనిత మంత్రి పదవులు అనుభవిస్తున్నారు. వీరిలో అచ్చెన్నాయుడు విషయంలో ఎలాంటి అనుమానాలు లేవు. మిగతా ముగ్గురిలో ఒకరికి ఊస్టింగ్ తప్పదన్న ప్రచారం జరుగుతోంది. ఆ లిస్ట్లో హోంమంత్రిగా ఉన్న అనిత పేరు ముందు వరసలో ఉంటే. ఆమె పనితీరుపై చంద్రబాబు అసహనంగా ఉన్నారట. కేబినెట్ విస్తరణ జరిగితే.. ఆమెను తప్పించడం మాత్రం ఖాయమన్న వార్తలు వస్తున్నాయి.
ఇక.. కేబినెట్ విస్తరణ ఇప్పుడు చేయకపోతేనే మంచిదని విశ్లేషులు భావిస్తున్నారు. ఎందుకంటే.. జనసేన, బీజేపీ చెరో మంత్రి కావాలంటూ పోటీపడుతున్నాయి. జనసేన నుంచి నాగబాబును తీసుకోవడం ఖాయమే… ఇక.. బీజేపీకి కూడా ఒక మంత్రి పదవి ఇవ్వాల్సి ఉంటుంది. ఇప్పటికే జనసేనకు మూడు, బీజేపీకి ఒక మంత్రి పదవి ఉన్నాయి. మరో రెండు ఇస్తే… ఆ రెండు పార్టీలకు ఆరు మంత్రి పదవులు ఇచ్చినట్టు అవుతుంది. టీడీపీకి 19 మంది మంత్రులు మాత్రమే ఉంటారు. కనుక… ఇప్పట్లో కేబినెట్ విస్తరణ చేయకపోతేనే బెటరని రాజకీయ నిపుణులు, టీడీపీ సీనియర్లు భావిస్తున్నారు. మరి… రాజకీయాల్లో అపర చాణుక్యుడిగా పేరుపొందిన చంద్రబాబు మదిలో ఏముందో కదా…!