
భద్రాద్రి కొత్తగూడెం, (క్రైమ్ మిర్రర్): అన్నపరెడ్డిపల్లి మండలంలోని గుంపెన గ్రామం ధాన్యం కొనుగోలు కేంద్రంలో రైతులు తమ సమస్యలపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. మిల్లర్లు ఒక్క క్వింటాల్కు రూ.140 లంచం డిమాండ్ చేస్తున్నారని ఆరోపిస్తూ, కాంగ్రెస్ ఎమ్మెల్యే జారే ఆదినారాయణను రైతులు నిలదీశారు.
కౌలుకు తీసుకొని సాగు చేస్తున్న తాము, లంచాల పేరుతో మిల్లర్ల దోపిడీకి గురవుతున్నామని వాపోయారు. అంతేకాదు, ప్రభుత్వం కౌలు రైతులకు ఇవ్వాల్సిన రూ.12,000 ఎప్పుడు ఇవ్వబోతున్నదనే ప్రశ్నను ఎమ్మెల్యేకు ఎదురుపెట్టారు. ఎంతో కష్టపడి అప్పులు చేసి పంట సాగు చేసినా, కనీసం ధర కల్పించడంలో ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని రైతులు తీవ్రంగా విమర్శించారు. ఈ ఘటనతో కొనుగోలు కేంద్రంలో ఉద్రిక్తత నెలకొంది. ఎమ్మెల్యే రైతులను శాంతింపజేసే ప్రయత్నం చేసినా, వారి ఆగ్రహం అదుపులోకి రావడం కొద్దిగా సమయం పట్టింది.