
సినీ నటుడు పోసాని కృష్ణమురళీని నిన్న (బుధవారం) రాత్రి అదుపులోకి తీసుకున్నారు ఏపీ పోలీసులు. హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఓ అపార్ట్మెంట్లో నివాసం ఉంటున్న పోసాని కృష్ణమురళీ ఇంటికి వెళ్లారు అన్నమయ్య జిల్లా రాయచోటి పోలీసులు. ఆ సమయంలో… పోలీసులతో వాగ్వాదానికి దిగారు పోసాని. ముందు నోటీసులు ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారాయన. తనకు ఆరోగ్యం సరిగాలేదని… ఇప్పుడు రాలేనని చెప్పారు. నోటీసులు ఇస్తే… తానే విచారణకు హాజరవుతానని కూడా పోలీసులతో వాగ్వాదానికి దిగారు పోసాని. దీంతో… పోలీసులు అతన్ని అతికష్టం మీద సంబేపల్లి ఎస్సై ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. రాయదుర్గం పోలీసులకు సమాచారం ఇచ్చి… పోసానిని ఏపీకి తరలించారు.
వైఎస్ఆర్సీపీ హయాంలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ను అసభ్యకరంగా దూషించారని పోసాని కృష్ణమురళీపై ఫిర్యాదులు ఉన్నాయి. కులాల పేరుతో దూషించి.. ప్రజల్లో విభేదాలు సృష్టించారని అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లెలోనూ ఆయనపై కేసు నమోదైంది. 196. 353(2), 111 రెడ్విత్ 3(5) బీఎన్ఎస్ సెక్షన్ల కింద పోలీసులు కేసు పెట్టారు. ఈ కేసులోనే పోసానిని అరెస్ట్ చేసినట్టు తెలుస్తోంది. దీంతోపాటు ఏపీలోని పలు పోలీస్స్టేషన్లలో పోసానిపై కేసులు నమోదయ్యాయి.
పోసాని కృష్ణ మురళిపై గతంలో అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లె పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. సినిమా పరిశ్రమపై విమర్శలు చేశారని స్థానికుల ఫిర్యాదు మేరకు.. 196, 353(2), 111 రెడ్విత్ 3(5) సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో బుధవారం రాత్రి సంబేపల్లి ఎస్సై.. రాయదుర్గం చేరుకొని పోసానిని అదుపులోకి తీసుకున్నారు. ఆరోగ్యం బాగోలేదని చెప్పినా… పోలీసులు వినలేదని పోసాని భార్య కుసుమ చెప్పారు. కొంతకాలంగా ఆయన కడుపు నొప్పితో బాధపడుతున్నారని చెప్పారామె. ఆస్పత్రికి వెళ్లాల్సి ఉందని… ఆ విషయం చెప్పినా… పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్లారని అంటున్నారు పోసాని భార్య కుసుమ. రాత్రి పూట ఎందుకు వచ్చారు..? పగలు రావొచ్చు కాదా..? అని ప్రశ్నించినా సమాధానం చెప్పలేదన్నారు.
రాత్రి పోసానిని ఆదుపులోకి తీసుకున్న పోలీసులు… కడపకు తరలించారు. కడపలోని ఓ రహస్య ప్రాంతంలో ఉంచి ప్రశ్నించినట్టు సమాచారం. అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లె పోలీసుస్టేషన్కు తీసుకెళ్లి విచారణ జరిపిన తర్వాత… రాజంపేట కోర్టులో ప్రవేశపెట్టే అవకాశం ఉంది.