
Online Job Scam In Hyderabad: ఈజీ మనీకి అలావాటు పడి నట్టేటా మునుగుతున్నా, ఇంకా చాలా మంది పద్దతి మార్చుకోవడం లేదు. కేటుగాళ్లు చెప్పే మాయ మాటలు నమ్మి.. మోసపోయి గోసపడుతున్నారు. తాజాగా తక్కువ పని ఎక్కువ జీతం అని చెప్పగానే ఎగేసుకుంటూ వెళ్లాడో వ్యక్తి. చివరకు లక్షల రూపాయలు పోగొట్టుకుని లబోదిబోమన్నాడు. పోలీసులను ఆశ్రయించి తన డబ్బు ఇప్పించాలని వేడుకున్నాడు. అసలు ఏం జరిగిందంటే..
పెట్టుబడికి డబులు లాభం అంటూ..
రోజు కు 3 గంటలు పని, మూడు నెలల్లో రూ. 50 వేలు సంపాదించే అవకాశం.. పెట్టుబడి పెడితే డబుల్ ఆదాయం అంటూ ఓ అమాయకుడిపై సైబర్ నేరగాళ్లు వల వేశారు. నిజమే అని నమ్మిన సదరు యువకుడి నుంచి ఏకంగా రూ. 10.19 లక్షలు కొల్లగొట్టారు. హైదరాబాద్ కు చెందిన ఓ యువకుడికి వాట్సాప్ లో ఓ మెసేజ్ వచ్చింది. రహేజా కార్పొరేషన్ పేరుతో వచ్చిన పార్ట్ టైమ్ జాబ్ ఆఫర్ లింక్ ఓపెన్ చేసి.. దానిలో రిజిస్టర్ అయ్యాడు. వెంటనే అతడి అకౌంట్ లోకి రూ. 10 వేలు జమ చేశారు. కొన్ని చిన్న చిన్న టాస్క్ లు ఇచ్చారు. రియల్ ఎస్టేట్ సంస్థలకు రివ్యూలు ఇవ్వాలని.. ఆటోమేటిక్ గా డబ్బులు అకౌంట్ లోకి వస్తాయని నమ్మించారు. తొలి 20 టాస్క్ లకు ఒక్కో దానికి రూ. 500 చొప్పున డబ్బులు బాధితుడి అకౌంట్ లోకి జమ చేశారు. అందులో కొంత డబ్బును మీ పేరు మీద కంపెనీలో పెట్టుబడి పెడుతున్నామని చెప్పారు. ఈ డబ్బుకు తక్కువ సమయంలోనే రెట్టింపు లాభం పొందే అవకాశం ఉందన్నారు.
Read Also: బ్యాంకులో 59 కిలోల బంగారం మాయం, అసలేం జరిగిందంటే?
నమ్మకం కలగడంతో లక్షల్లో పెట్టుబడి
కొద్ది రోజుల తర్వాత కంపెనీలో పెట్టుబడి పెట్టిన డబ్బుకు ఎక్కువ మొత్తంలో లాభాలు వచ్చినట్లు చూపించారు. ఆ డబ్బును బాధితుడి అకౌంట్లో జమ చేశారు. ఆ డబ్బును విత్ డ్రా చేసుకునే అవకాశం కల్పించారు. మంచి లాభాలు వస్తున్నాయని సదరు యువకుడు నమ్మడంతో నెమ్మదిగా డబ్బులు తమ కంపెనీలో పెట్టుబడి పెట్టేలా చేశారు. విడుతల వారీగా ఏకంగా రూ. 10.19 లక్షలు పెట్టుబడి పెట్టాడు సదరు యువకుడు. ఆ తర్వాత విత్ డ్రా ఆప్షన్ ను క్లోజ్ చేశారు. ఇదేంటి అడగ్గా, మరిన్ని పెట్టుబడులు పెట్టాలన్నారు. బాధితుడికి అసలు విషయం అర్థమై కంపెనీ గురించి ఆరా తీయడంతో మొత్తం కథ బయటపడింది. అదో బోగస్ కంపెనీ అని తేలింది. మోసపోయినట్లు గుర్తించిన సదరు యువకుడు సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించాడు. తన డబ్బులు ఇప్పించాలని వేడుకున్నాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.