
ఐఏఎస్ అధికారి అంటూ యువకులను నమ్మించి మోసం చేస్తున్న కిలాడి లేడీని పోలీసులు అరెస్ట్ చేశారు. డాక్టర్ ప్రత్యూష ఐఏఎస్గా చలామణీ అవుతూ యువకులను మోసం చేసి డబ్బులు వసూలు చేస్తున్న కిలాడి లేడీ సరితను అరెస్టు చేశారు పోలీసులు.నల్గొండ జిల్లా మిర్యాలగూడ మండలం లావుడి తండాకు చెందిన సరిత అలియాస్ ప్రత్యూష విద్యార్ధిని ముసుగులో హాస్టల్లో ఉంటూ తోటి యువతుల సెల్ ఫోన్లు, నగదు దొంగలించేది. కొంతకాలంగా డబ్బున్న వారిని టార్గెట్ చేస్తూ తాను డాక్టర్, ఐఏఎస్, డీఎస్పీ కూతురు అంటూ రకరకాల పదవులను వాడుకొని యువకులను మోసం చేసింది సరిత
ఏడాది క్రితం ఒక వైద్యుడిని బెదిరించి రూ.5 లక్షలు వసూలు చేసింది సరిత. మరో యువకుడిని డబ్బు ఇవ్వకపోతే చంపేస్తానని బెదిరించి మరీ డబ్బులు వసూలు చేసింది. మూడు రోజుల క్రితం డయల్ 100 ద్వారా పోలీసులకు ఫోన్ చేసి తాను డీఎస్పీ సతీమణిని అంటూ ఒకసారి, యువతి హత్య జరిగిందని మరోసారి పోలీసుల ఆటపట్టించింది సరిత.
సరిత పైన చైతన్యపురి, ఉప్పల్, నల్గొండ టూ టౌన్, మిర్యాలగూడ వన్ టౌన్, నార్కెట్పల్లి, నల్గొండ పోలీస్ స్టేషన్లలో చోరీ కేసులు నమోదు చేశారు పోలీసులు.నిన్న ఒక చోరీ కేసులో సరితను అరెస్టు చేయగా, వాస్తవాలు బయటపడడంతో రిమాండ్కు తరలించారు పోలీసులు.సరిత చేతిలో మోసపోయిన యువతుల లిస్ట్ భారీగానే ఉన్నట్లు తెలుస్తోంది.