US–Iran Negotiations In Islamabad: అమెరికా-ఇరాన్ మధ్య ఉన్న ఉద్రిక్త పరిస్థితులను తగ్గించేందుకు పాకిస్థాన్లో కీలక చర్చలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో రాజధాని ఇస్లామాబాద్ సిద్ధమైంది. అంతర్జాతీయ స్థాయిలో ప్రాధాన్యత ఉన్న ఈ సమావేశాల కోసం ప్రభుత్వం ముందస్తుగా కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టింది.
ఇస్లామాబాద్ లో లాక్ డౌన్
చర్చలకు హాజరవుతున్న ఉన్నత స్థాయి ప్రతినిధుల భద్రత దృష్ట్యా నగరాన్ని దాదాపు లాక్డౌన్ చేశారు. ముఖ్యమైన ప్రాంతాల్లో చెక్ పోస్టులు ఏర్పాటు చేసి, వాహనాల రాకపోకలను కఠినంగా పరిశీలిస్తున్నారు. ప్రధాన రహదారులను మూసివేసి, అధికారిక వాహనాలకు మాత్రమే అనుమతి ఇస్తున్నారు. నగరమంతా భారీ సంఖ్యలో పోలీసులు, భద్రతా దళాలు మోహరించబడ్డాయి. ప్రతి కదలికపై నిఘా ఉంచుతూ అధికారులు అప్రమత్తంగా ఉన్నారు.
రెండు రోజుల పాటు పబ్లిక్ హాలిడే
భద్రతా ఏర్పాట్లలో భాగంగా పాకిస్థాన్ ప్రభుత్వం మరో ముఖ్య నిర్ణయం తీసుకుంది. చర్చలు జరుగుతున్న రోజుల్లో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు ఇస్లామాబాద్లో రెండు రోజుల పాటు పబ్లిక్ హాలిడే ప్రకటించింది. దీంతో ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థలు తాత్కాలికంగా మూసివేశారు. ప్రజలు అవసరం లేకుండా బయటకు రావద్దని కూడా సూచనలు ఇచ్చారు.
అమెరికా-ఇరాన్ మధ్య ఇంతటి ఉన్నత స్థాయి చర్చలు చాలా కాలం తర్వాత జరగడం విశేషంగా మారింది. పశ్చిమాసియాలో శాంతి స్థాపన, ముఖ్యంగా హార్ముజ్ జలసంధి భద్రత వంటి అంశాలు ఈ సమావేశాల్లో కీలకంగా చర్చకు రానున్నాయి. ఈ చర్చలు సానుకూలంగా ముగిస్తే అంతర్జాతీయంగా నెలకొన్న ఉద్రిక్తతలు తగ్గే అవకాశముందని నిపుణులు భావిస్తున్నారు.
ఈ నేపథ్యంలో ప్రపంచ దేశాలు, అంతర్జాతీయ మీడియా ఈ చర్చలపై ఆసక్తిగా గమనిస్తున్నాయి. ఇస్లామాబాద్లో జరుగుతున్న ఈ సమావేశాలు భవిష్యత్తులో గ్లోబల్ రాజకీయాలపై ప్రభావం చూపే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు.
