
హైదరాబాద్, మే 23 (క్రైమ్ మిర్రర్): ప్రతి సారి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన జరిగే సందర్భంలో నిర్బంధాలు, ముందస్తు అరెస్టులు ఎందుకు జరుగుతున్నాయంటూ మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీశారు. ప్రజాపాలనలో ఈ తరహా కట్టడాలు తగవా అంటూ ఆయన తీవ్రంగా ప్రశ్నించారు.
నిన్న జహీరాబాద్ పర్యటన సందర్భంగా రైతులను అరెస్టు చేయడం, అదే విధంగా మొన్న నాగర్ కర్నూల్ పర్యటనలో చెంచు తెగవారిని నిర్బంధించడం సరికాదన్నారు. ముఖ్యమంత్రి పర్యటనలు అంటే కంచెలు, పోలీసులు, ముందస్తు అరెస్టులా? అని హరీష్ రావు మండిపడ్డారు.
ఇది ఎలాంటి పాలన? “జహీరాబాద్ నిమ్స్ చుట్టూ ఉన్న గ్రామాలను అష్టదిగ్బంధనం చేయడం ప్రజాస్వామ్యానికి నిదర్శనమా?” అని ఆయన ప్రశ్నించారు. సీఎం పర్యటన కోసం ప్రజలను అణచడం, రైతుల గొంతు దించేయడం ఎంతవరకు సమంజసమని నిలదీశారు.
రైతు నాయకుల విడుదల డిమాండ్ : అక్రమంగా అరెస్టు చేసిన రైతులు, రైతు నాయకులను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ప్రజల భద్రత పేరుతో ప్రజలే గల్లంతవుతుంటే, అది ప్రజాపాలన ఎలా అవుతుందని ఆయన అన్నారు.