
Iran And Israel War: ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య యుద్ధం తీవ్ర స్థాయికి చేరింది. 200 యుద్ధ విమానాలతో ఇరాన్ లోని 100 టార్గెట్స్ పై ఇజ్రాయెల్ బాంబు దాడులు చేసింది. ఇరాన్ న్యూక్లియర్ సైట్లు, మిలటరీ బేస్ లను ధ్వంసం చేసింది. ఇరాన్ లోని అత్యంత ముఖ్యమైన నంతాజ్ న్యూక్లియర్ సైట్ పైనా బాంబులు వేసింది. ఈ ఘటనలో ఇరాన్ ఆర్మీ చీఫ్ సహా పలువురు కీలక అధికారుల, అణు శాస్త్రవేత్తలు చనిపోయారు. ప్రతిగా ఇరాన్ ఇజ్రాయెల్ మీద 100 మిసైల్స్ తో అటాక్ చేసింది. వీటిలో తమ భూ భాగంలోకి వచ్చిన కొన్ని మిసైల్స్ ను జోర్డాన్ కూల్చి వేసింది. మిగతా వాటిని ఇజ్రాయెల్ గాల్లోనే పేల్చి వేసింది. ప్రస్తుతం రెండు దేశాలు మిసైల్స్, డ్రోన్లలో పరస్పర దాడులకు పాల్పడుతున్నాయి.
భారత్ కు క్షమాపణలు చెప్పిన ఇజ్రాయెల్
యుద్ధం నేపథ్యంలో ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ తమ సోషల్ మీడియా వేదికగా ఓ పోస్టు షేర్ చేసింది. “ఇరాన్ ప్రపంచానికి ప్రమాదం. ఇజ్రాయెల్ దాని అంతిమ లక్ష్యం కాదు. అది ఆరంభం మాత్రమే. మాను ఇది తప్పమరో దారి లేదు” అని వెల్లడించింది. ఈ సందర్భంగా ఓ మ్యాప్ షేర్ చేసింది. ఈ మ్యాప్ కారణంగా భారతీయులు ఆదేశంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ పోస్టుపై విమర్శలు చేస్తున్నారు. ఆదేశ ప్రధాని నెతన్యాహును ట్యాగ్ చేసి పోస్టులు పెట్టారు. వెంటనే పొరపాటును గమనించిన ఇజ్రాయెల్, జరిగిన పొరపాటుకు క్షమాపణలు చెప్పింది. ఈ మేరకు మరో పోస్టును పెట్టింది.
ఇంతకీ ఆ మ్యాప్ లో ఏం ఉంది?
ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ షేర్ చేసిన పోస్టులోని మ్యాప్ లో జమ్మూకశ్మీర్ ను సరిగ్గా చూపించలేదు. కొంత భాగం పాకిస్తాన్, మరికొంత భాగం చైనాలో కలిసినట్లు చూపించింది. ఈ నేపథ్యంలో ఇండియన్ నెటిజన్స్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే, ఆ పోస్టు కేవలం ఇరాన్ ప్రాంతాలకు సంబంధించిన ఉదాహరణ మాత్రమేనని, సరిహద్దుల్ని సరిగా చూపించలేదని చెప్పింది. ఒకవేళ ఈ ఫోటో వల్ల ఇబ్బంది కలిగి ఉంటే క్షమించాలని చెప్పింది. ఇరాన్ అణు బాంబులు తమకు ముప్పని ఇజ్రాయెల్ భావిస్తోంది. వద్దని వారించినా వినడం లేదు. ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్.. ఇరాన్ మీద దాడులకు దిగింది.