Mangalgiri Gang Rape: 13 ఏళ్ల బాలికపై నలుగురు పలుమార్లు సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటన గుంటూరు జిల్లా మంగళగిరిలో ఆలస్యంగా వెలుగుచూసింది. ఈ కిరాతక ఘటనలోని నలుగురు నిందితుల్లో తండ్రీకొడుకులు ఉడటం అందరినీ షాక్ కి గురి చేస్తుంది. ఈ ఘటన ఈ నెల 18న రాత్రి జరగగా తాజాగా వెలుగులోకి వచ్చింది. ఈ సామూహిక అత్యాచారంపై నార్త్ సబ్ డివిజన్ డీఎస్పీ సీహెచ్ మురళీకృష్ణ కీలక విషయాలు వెల్లడించారు.
ఈ నెల 18న సామూహిక అత్యాచారం
ఈ నెల 18న రాత్రి పది గంటల సమయంలో బాధితురాలు తన స్నేహితులతో కలిసి ఉంది. ఈ సమయంలో అక్కడే మాటు వేసిన ముగ్గురు నిందితులు.. ఆమెకు మాయమాటలు చెప్పి, తమతోపాటు ఆటోలో ఎక్కించుకొని వెళ్లారు. ఆ తర్వాత నిందితులు తాడేపల్లి కేఎల్ రావు కాలనీకి చెందిన షేక్ ఖాదర్ బాషా (50), విజయవాడలోని ప్రకాష్ నగర్కు చెందిన షేక్ సలీమ్ (42), షేక్ రబ్బానీ (39) బాలికను మంగళగిరి బైపాస్ వెంబడి నిర్మానుష్య ప్రాంతానికి తీసుకువెళ్లి అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ తర్వాత సలీమ్ బాలికను మంగళగిరి లక్ష్మీనసింహస్వామి కాలనీ చివరకు తీసుకువెళ్లి మరోసారి అత్యాచారం చేశాడు. అనంతరం ఖాదర్ బాషా, అతని కుమారుడు కమల్ సాహెబ్ (25) బాలికను తాడేపల్లి కేఎల్ రావు కాలనీకి తీసుకువెళ్లి మళ్లీ రేప్ చేశారు.
నిందితులను రోడ్డు మీద నడిపించుకుంటూ..
అనంతరం రబ్బానీ బాలికను ఆటోలో ఎక్కించుకొని తీసుకువెళుతుండగా.. బాలిక కేకలు వేయడంతో స్థానికులు అడ్డుకుని ఆమెను విడిపించారు. సదరు బాలిక ఇంటికి చేరుకొని, తల్లికి జరిగిన విషయం చెప్పింది. అనంతరం బాధితురాలి తల్లి మంగళగిరి పట్టణ పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేసింది. డీఎస్పీ మురళీకృష్ణ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. సీఐ కే.వీరాస్వామి ఆధ్వర్యంలో లుగురు నిందితులను మంగళగిరి డాన్బోస్కో దగ్గర అరెస్ట్ చేశారు. నిందితులపై పోక్సో కేసు నమోదు చేసినట్లు డీఎస్పీ తెలిపారు. బాలికను వైద్య పరీక్షల నిమిత్తం ఎయిమ్స్కు తరలించినట్టు చెప్పారు. నిందితులను ఆదివారం సాయంత్రం కోర్టులో హాజరుపర్చారు. వారిని మంగళగిరి పోలీసుస్టేషన్ నుంచి రోడ్డుపై నడిపించుకుంటూ కోర్టుకు తీసుకువెళ్లారు.





