క్రైమ్ మిర్రర్, ములుగు ప్రతినిధి : జిల్లాలోని ఇంచర్ల గ్రామం యం.ఆర్ ఫంక్షన్ హాల్ లో జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి, ఎస్పీ శభరిష్, ఐటిడిఏ ప్రాజెక్ట్ ఆఫీసర్ చిత్రామిశ్రా తో కలిసి మంత్రి దనసరి అనసూయ సీతక్క నియోజక వర్గ అభివృద్ధి కార్యక్రమ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. నియోజకవర్గ అభివృద్ధికి ప్రతి ఒక్క ఉద్యోగి కృషి చేయాలని, శాశ్వత అభివృద్ధి పనులకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని, ముఖ్యంగా ములుగు నియోజకవర్గంలో విధులు నిర్వర్తించే ప్రతి ఉద్యోగి ప్రజల జీవన ప్రమాణాలు అభివృద్ధి చెందేలా చూడాలని, జీతం కోసం పని చేయకుండా ప్రజల కోసం పనిచేస్తే ప్రజలు కలకాలం అధికారులను గుర్తుపెట్టుకుంటారని తెలిపారు. ములుగు నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపించాలంటే అధికారులందరూ ఒక జట్టుగా ఏర్పడి ప్రజల సమస్యలను పరిష్కరించాలని అన్నారు. ఉద్యోగుల వద్దకు ప్రజలు తమ సమస్యలను తెలుపడానికి వచ్చే సమయంలో వారికి ఓపికతో సమాధానం చెప్పి వారి సమస్యలు పరిష్కారం అయ్యే విధంగా చూడాలని, ప్రజలకు సేవ చేస్తే ప్రజలు అధికారులనే దేవుళ్ళుగా కొలుస్తారని తెలిపారు.
Read Also : రేషన్ కార్డు ఉంటేనే ఇందిరమ్మ ఇళ్లకు అర్హులు.. మంత్రి పొంగులేటి కీలక ఆదేశాలు!!
ముఖ్యంగా గ్రామాలలో చిన్నచిన్న కుటీర పరిశ్రమలు ఏర్పాటు చేసి వాటి ద్వారా స్థానిక యువతకు మహిళలకు ఉపాధి కల్పించే విధంగా నూతన విధానాలను ఏర్పాటు చేసే దిశగా ప్రణాళికలు తయారు చేయాలని అన్నారు. గ్రామాలలో అధికారుల తీరు గ్రామాలకు వన్నె తెచ్చేలా ఉండాలని, అటవీ అధికారులు ముఖ్యంగా అడవుల వల్ల ప్రజలకు ఎలాంటి లాభాలు చేకూరుతాయో ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని సూచించారు. ప్రజల సమస్యలను అర్థం చేసుకోవడం కోసం జిల్లా అధికారులు తప్పనిసరిగా ఫీల్డ్ విజిట్ చేయాలని దాని ద్వారా గ్రామాల సమస్యలపై అధికారులకు సరైన అవగాహన వస్తుందని, అధికారులందరూ ఒకే లక్ష్యంతో పనిలో పోటీపడి పని చేయాలని అన్నారు. నియోజకవర్గంలో పంచాయతీరాజ్ ఆధ్వర్యంలో ఉన్న పనులన్నీ త్వరితగతిన పూర్తి చేయాలని గ్రామాలలో సిసి రోడ్లు నాణ్యత ప్రమాణాలు పాటిస్తూ పూర్తి చేయాలని, డి ఆర్ డి ఓ ద్వారా మహిళా సంఘాల సభ్యులకు రుణాలు అందించాలని, స్వయం సహాయక మహిళా సంఘాలపై అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలని అన్నారు. ములుగు జిల్లాలో ప్రజావాణి కార్యక్రమంలో ఎక్కువగా భూ సమస్యలపై దరఖాస్తులు వస్తున్న నేపథ్యంలో ధరణి గైడ్ లైన్స్ ప్రకారం భూ సమస్యలకు పరిష్కారం చూపాలని, కస్తూరిబా గాంధీ బాలికల పాఠశాలల నూతన భవన నిర్మాణం వెంటనే పూర్తి చేయాలని సంబంధిత అధికారులు ఆదేశించారు.
Also Read : నిరుద్యోగులకు అలర్ట్.. గ్రూప్ 1, 2, 3 పరీక్షల తేదీలు ఖరారు..
వచ్చే విద్యా సంవత్సరంలోపు నూతన భవనాలు విద్యార్థులకు అందుబాటులోకి రావాలని, నూతన విద్యా సంవత్సరంలో ప్రాథమిక పాఠశాలల ఆవరణలోనే అంగన్వాడి కేంద్రాలను ప్రారంభించనున్నట్లు తెలిపారు. అదేవిధంగా అంగన్వాడీ కేంద్రాలలో సిసి కెమెరాలను ఏర్పాటు చేస్తూ నర్సరీ తరగతులను కూడా ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. 40 పాఠశాలలో డిజిటల్ తరగతులు ప్రారంభించడానికి ప్రణాళిక సిద్ధం చేస్తున్నామని, విద్యార్థులు దేశానికి మానవ వనరులు కాబట్టి పాఠశాలలపై అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలని అన్నారు. మేడారం స్తూపం ప్రాంతంలో నూతన ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఏర్పాటు చేసే దిశగా ప్రతిపాదనలు సిద్ధం చేయాలని, ములుగు ఏరియా హాస్పిటల్ లో వైద్య సిబ్బంది కొరత ఉందని, వాటికి సంబందించిన ప్రతిపాదనలను కూడా సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. ములుగు జిల్లాలో నూతనంగా ప్రారంభంకానున్న వైద్య కళాశాలకు ప్రిన్సిపాల్ ను నియమించే విధంగా చూస్తామని తెలిపారు. గిరిజనులకు ఐటీడీఏలో అధికారులు ఎల్లప్పుడు అందుబాటులో ఉండాలని, నూతన ఐటిడిఏ భవనం కొరకు కూడా ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అన్నారు. ఏఎన్ఎం, జూనియర్ లెక్చరర్స్ జీతాలు కొంతకాలంగా పెండింగ్ ఉన్నాయని, త్వరలోనే జీతాలు చెల్లించే విధంగా చూస్తామని, త్వరలోనే ఐటీడీఏ అధికారులతో పూర్తి స్థాయి రివ్యూ నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. అనంతరం జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి మాట్లాడుతూ.. ములుగు నియోజకవర్గ అభివృద్ధి పనుల రూపకల్పన సిద్ధం చేయాలని మంజూరు చేసిన పనులు వెంటనే పూర్తి చేయాలని, ప్రభుత్వం నియోజకవర్గ అభివృద్ధి కోసం 10 కోట్ల రూపాయల నిధులను కేటాయించడం జరిగిందని తెలిపారు.
Read Also : ప్రజల్ని దోచుకునేందుకేనా ఎల్ఆర్ఎస్??.. మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి
మేడారం ప్రాంతంలో శాశ్వత ప్రతిపాదికన అభివృద్ధి పనులు జరగాలని ముఖ్యంగా వరదల సమయంలో ధ్వంసం అయిన కొండాయి వంతెన కోసం ప్రభుత్వం శాశ్వతం పరిష్కారం దిశగా ఆలోచించి 9 కోట్ల రూపాయలతో నూతన వంతెన నిర్మాణం చేపట్టడం జరుగుతుందని అన్నారు. అనంతరం జిల్లా ఎస్పీ మాట్లాడుతూ.. మేడారం జాతర విజయవంతం చేయడంలో ఉద్యోగుల పాత్ర చాలా కీలకంగా ఉందని వారందరికీ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. గత జాతర కంటే ఈ జాతరను భక్తులకు మెరుగైన సదుపాయాలు కల్పించడం జరిగిందని అన్ని శాఖల అధికారుల సమన్వయంతో వచ్చే జాతరలో భక్తులకు మరిన్ని మెరుగైన సౌకర్యాలు కల్పించే విధంగా ఇప్పటి నుంచే ప్రణాళికలు సిద్ధం చేయాలని సూచించారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలలోని యువత మత్తు పదార్థాలకు అలవాటు పడి బంగారు భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారని, మత్తు పదార్థాల విషయంలో యువతకు ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు కల్పిస్తున్నామని ములుగు జిల్లాను గంజాయి మత్తు పదార్థాలు లేని జిల్లాగా తీర్చిదిద్దుతామని అన్నారు. మత్తు పదార్థాలకు బానిస అయినవారి కోసం ములుగు జిల్లా కేంద్రంలో రిహాబిలిటేషన్ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో ములుగు జిల్లా అటవీ అధికారి రాహుల్ కిషన్ జాదవ్, అదనపు కలెక్టర్ పి శ్రీజ, మహబూబాబాద్ అదనపు కలెక్టర్ లెనిన్ వాత్సల్ టోప్పో, అదనపు కలెక్టర్ (రెవెన్యూ) మహేందర్ జి, ఏటూరునాగారం అదనపు ఎస్పీ సిరిశేట్టి సంకీర్త్, ఆర్డీఓ సత్యపాల్ రెడ్డి, డి ఆర్ డి ఓ శ్రీనివాస్ కుమార్, ములుగు భూపాలపల్లి మహబూబాబాద్ జిల్లాల అధికారులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి :
- ‘రైతు నేస్తం’ కార్యక్రమాన్ని ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి..
- బీఆర్ఎస్ పార్టీకి మరో షాక్.. పార్టీకి మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప గుడ్బై
- ఎవ్వర్నీ వదలం, విచారణ జరిపిస్తాం.. యాదాద్రి పునర్నిర్మాణంలోనూ అవినీతి : మంత్రి కోమటిరెడ్డి
- లోక్సభ ఎన్నికల కాంగ్రెస్ తొలి జాబితాపై కసరత్తు.. రేపు కాంగ్రెస్ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ భేటీ