
పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరింత పెరిగిపోతున్నాయి. ఏ క్షణం ఏం జరుగుతుందో.. ఎక్కడ ఏ బాంబు పేలుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య భీకర యుద్ధం కొనసాగుతోంది. పరస్పర దాడుల కారణంగా తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. తాజాగా ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమెన్ నెతన్యాహు సంచలన ఆరోపణలు చేశారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ను ఇరాన్ చంపాలని చూస్తోందన్నారు.
ఇరాన్కు నంబర్ వన్ శత్రువు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అన్నారు బెంజిమెన్ నెతన్యాహు. ఇరాన్తో జరిగిన నకిలీ అణు ఒప్పందాన్ని ట్రంప్ రద్దుచేశారు. దీంతో తమ అణు కార్యక్రమానికి ముప్పుగా ట్రంప్ను ఇరాన్ గుర్తించింది. అందుకే ట్రంప్ లేకుండా చేయాలని ఇరాన్ భావిస్తోందని నెతన్యాహు తీవ్ర ఆరోపణలు చేశాడు. ఇప్పటికే రెండు సార్లు ట్రంప్ను హత్య చేసేందుకు ప్లాన్ చేసిందన్నారు. ఇరాన్ దగ్గర అణ్వాయుధం ఉండకూడదు. ఇజ్రాయెల్ తననే కాకుండా ప్రపంచాన్ని కూడా రక్షిస్తోంది. ఇజ్రాయెల్ దాడులు ఇరాన్ అణు కార్యక్రమాన్ని చాలా వరకు వెనక్కి నెట్టాయని తెలిపారు నెతన్యాహు.
ఇజ్రాయెల్, ఇరాన్ వరుసగా నాలుగవ రోజూ పరస్పరం భీకర దాడులు కొనసాగుతున్నాయి. ఇరాన్ రక్షణ శాఖ ప్రధాన కార్యాలయంతో పాటు గ్యాస్, చమురు శుద్ధి కర్మాగారాలపై ఇజ్రాయెల్ భారీగా దాడులు చేసింది. క్షిపణి దాడులతో టెహ్రాన్ దద్దరిల్లిపోయింది. ఇరాన్ క్షిపణులు ఇజ్రాయెల్లో భారీ విధ్వంసం సృష్టిస్తున్నాయి. పశ్చిమాసియాలోని అమెరికా సైనిక, వైమానిక స్థావరాలు తదితరాల జోలికి రావొద్దని ఇరాన్ను ట్రంప్ తీవ్రంగా హెచ్చరించారు. వాటిపై దాడులు చేస్తే కనీవినీ ఎరగని రీతిలో సైనిక శక్తిని ప్రయోగించి ఇరాన్ను తుడిచిపెట్టేస్తామని హెచ్చరించారు. తక్షణం దిగొచ్చి తమతో అణు ఒప్పందం చేసుకుంటేనే దాడులు తగ్గుముఖం పడతాయంది