క్రైమ్ మిర్రర్, ఆన్ లైన్ డెస్క్ : తెలంగాణలో మరోసారి జిల్లాల విభజన జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఈ ప్రక్రియ మొదలయ్యే అవకాశం ఉంది. రాష్ట్రంలో 2016 అక్టోబర్లో కొత్త జిల్లాల ఏర్పాటు జరిగింది. అయితే అవసరం లేకున్నా.. ప్రజల డిమాండ్లకు అనుగుణంగా కొన్ని జిల్లాలను ఏర్పాటు చేశారనే వాదన ఉంది. ఉదాహరణకు ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలున్న సికింద్రాబాద్ లోక్ సభ స్థానాన్ని జిల్లాగా ఏర్పాటు చేయకుండా.. తొమ్మిది మండలాలతో ములుగును మాత్రం కొత్త జిల్లాగా ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలోనే రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన కొద్ది రోజులకే జిల్లాల స్వరూపాన్ని మార్చేస్తామనే దిశగా సంకేతాలిచ్చారు. జిల్లాలు, రెవెన్యూ డివిజన్ల విభజన, మండలాల పునర్విభజనపై ఓ కమిషన్ ఏర్పాటు చేస్తామని సీఎం పగ్గాలు చేపట్టిన తొలి నాళ్లలో రేవంత్ రెడ్డి చెప్పారు. ఈ కమిషన్ అధ్యయనం ప్రకారం కొత్త జిల్లాలు ఏర్పాటు చేస్తామని ఆయన చెప్పారు. అయితే తెలంగాణలో 17 లోక్ సభ నియోజకవర్గాలను జిల్లాలుగా ఏర్పాటు చేసే యోచనలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉందని తెలుస్తోంది. అంటే ప్రస్తుతం ఉన్న 33 జిల్లాలను కాస్తా 17కి కుదిస్తారు. జిల్లాల సంఖ్య తగ్గించడం మంచి ఆలోచనే కావచ్చు కానీ.. లోక్ సభ నియోజకవర్గాలను జిల్లాలుగా మార్చడం ద్వారా కొత్త సమస్యలు తలెత్తే అవకాశమూ లేకపోలేదు.
Read Also : బిజాపూర్లో భీకర ఎన్కౌంటర్.. ఆరుగురు మావోయిస్టులు మృతి!!!
ఉదాహరణకు మహబూబాబాద్ లోక్ సభ స్థానాన్ని తీసుకుంటే.. ఈ నియోజకవర్గం పరిధిలో డోర్నకల్, మహబూబాబాద్, నర్సంపేట, ములుగు, పినపాక, ఇల్లెందు, భద్రాచలం అసెంబ్లీ నియోజకవర్గాలు వస్తాయి. కొత్త జిల్లాల ఏర్పాటు తర్వాత ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని వాజేడు, వెంకటాపురం మండలాలను ములుగు జిల్లాలో కలిపారు. ఇప్పుడు మహబూబాబాద్ లోక్ సభ స్థానాన్ని జిల్లాగా మారిస్తే వాజేడు నుంచి మహబూబాబాద్ వెళ్లాలంటే 165 కి.మీ. ప్రయాణించాలి. భద్రాచలం, మహబూబాబాద్ మధ్య దూరం 110 కి.మీ. పైనే ఉంటుంది. ఇది ఖమ్మం, భద్రాచలం పట్టణాల మధ్య ఉన్న దూరానికి దాదాపు సమానం. ఇలాంటి సందర్భాల్లో జిల్లాల విభజనకు అర్థం గానీ, దాని వల్ల వచ్చే ప్రయోజనం కానీ ఉండదు. జిల్లాలను పునర్విభజించే యోచనలో గనుక ప్రభుత్వం ఉంటే.. పార్లమెంట్ నియోజకవర్గాలను జిల్లాలుగా మార్చడమే కాకుండా.. జిల్లా కేంద్రం నుంచి జిల్లాలోని చివరి మండలానికి ఉన్న దూరాన్ని పరిగణనలోకి తీసుకుంటే బాగుంటుందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. కొత్త రాష్ట్రం ఏర్పాటయ్యే నాటికి తెలంగాణలో 10 జిల్లాలు ఉండగా.. కేసీఆర్ సర్కారు వాటిని 33 జిల్లాలుగా విభజించింది. కొత్త జిల్లాల ఏర్పాటుకు ముందు.. కొన్ని జిల్లాల ప్రజలు జిల్లా కేంద్రానికి వెళ్లడానికి ఆరు గంటలకుపైగా ప్రయాణం చేయాల్సి వచ్చేది. ఉమ్మడి ఖమ్మం జిల్లానే ఉదాహరణగా తీసుకుంటే.. ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లో ఉన్న వెంకటాపురం నుంచి జిల్లా కేంద్రమైన ఖమ్మం వెళ్లాలంటే.. 240 కి.మీ. ప్రయాణించాలి.
Also Read : మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆరెంజ్ అలర్ట్ జారీ!!
ఖమ్మం నుంచి హైదరాబాద్ కంటే ఇది 40 కి.మీ. ఎక్కువ దూరం. ఇలాంటి పరిస్థితుల్లో కొత్త జిల్లాల ఏర్పాటుకు పూనుకున్న కేసీఆర్ ప్రభుత్వం.. స్థానికుల నుంచి వచ్చిన డిమాండ్లను కాదనలేక జిల్లాల సంఖ్యను 33కు పెంచుకుంటూ పోయింది. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాను 4 జిల్లాలుగా విభజించడమే దీనికి మంచి ఉదాహరణ. ఇప్పుడు అవసరం లేని చోట జిల్లాలను తగ్గించి.. అవసరమని భావించిన చోట కొత్త జిల్లాలను ఏర్పాటు చేస్తే అటు ప్రజలకు, ఇటు ప్రభుత్వానికి ప్రయోజనకరంగా ఉంటుంది. ఏపీలోనూ జగన్ సర్కారు 13 జిల్లాలను ఇలాగే 26 జిల్లాలుగా మార్చింది. అక్కడ కూడా ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అద్దంకి నుంచి ఒంగోలుకు గంటలోపే చేరుకోవచ్చు.. కానీ దాన్ని బాపట్ల జిల్లాలో కలిపారు. దీంతో అద్దంకి నుంచి కొత్త జిల్లా కేంద్రమైన బాపట్ల వెళ్లాలంటే రెండు గంటలు ప్రయాణించాల్సిన పరిస్థితి. అంతే కాదు పాడేరు కేంద్రంగా ఏర్పాటైన అల్లూరి జిల్లాలో ఎటపాక రెవెన్యూ డివిజన్ను కలిపారు. ఈ రెవెన్యూ డివిజిన్ పరిధిలో ఎటపాక, చింతూరు, కూనవరం, వరరామచంద్రపురం మండలాలు ఉన్నాయి. ఒకప్పుడు ఇవన్నీ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో భాగంగా ఉండేవి. కూనవరం నుంచి పాడేరు వెళ్లాలంటే 250 కి.మీ. ప్రయాణించాలి. అందులో చాలా వరకు ఘాట్ రోడ్డే. ఇక్కడ గమనించాల్సి విషయం ఏంటంటే కూనవరం నుంచి రాజమండ్రి మధ్య దూరం 170 కిలోమీటర్లే, అంతే కాదు కనెక్టివిటీ కూడా ఎక్కువ.
ఇవి కూడా చదవండి :
- తెలంగాణ కాంగ్రెస్లో బీసీ లొల్లి… సామాజిక న్యాయంపై గొంతెత్తుతున్న కొందరు నేతలు!!
- లోక్సభ ఎన్నికల తర్వాత ఆ పార్టీలో చేరే మెదటి వ్యక్తి సీఎం రేవంత్రెడ్డి… కేటీఆర్ హాట్ కామెంట్స్
- అన్నదాతలకు అండగా రంగంలోకి గులాబీ బాస్.. రోడ్ మ్యాప్ రెడీ!!!!
- దేశానికి ఏం చేశారని మూడోసారి మోదీకి ఓటు వేయాలి… ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి
- ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం.. ఏప్రిల్ 9 వరకు కవితకు జ్యూడిషియల్ రిమాండ్