
క్రైమ్ మిర్రర్, ఆన్ లైన్ డెస్క్ : రైలు ప్రయాణాల్లో రీల్స్ పిచ్చి మరోసారి ప్రమాదకరంగా మారింది. నాగర్కోయిల్ – చెన్నై రైలులో ఒక యువతి రైల్వే డోర్ వద్ద నిల్చొని, ప్రాణాలను లెక్కచేయకుండా ప్రమాదకర స్టంట్స్ చేసింది. వివరాల్లోకి వెళ్తే, ఆ యువతి రైలులోని ఫుట్బోర్డ్ వద్ద నిల్చొని, డోర్కు వేలాడుతూ నాట్యం చేయడం, అనంతరం చేతులు విడిచి డ్యాన్స్ చేయడం కూడా వీడియోలో దర్శనమిచ్చింది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఈ దృశ్యాలు చూసిన నెటిజన్లు తీవ్రంగా స్పందిస్తున్నారు. “ఇది ఏంటీ మూర్ఖత్వం?”, “తన ప్రాణాలే కాదు, ఇంకొంతమందికి ప్రేరణగా మారి వాళ్లను ప్రమాదంలో నెట్టేస్తుంది,” అంటూ కామెంట్లు చేస్తున్నారు.
ఇలాంటి ప్రవర్తన వల్ల మరికొంతమంది యువత కూడా ప్రమాదకర రీతిలో రీల్స్ చేసేందుకు ప్రేరేపవుతారని, వీరిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
రైల్వే శాఖ స్పందిస్తుందా?
ప్రమాదకరంగా ప్రయాణించడమే కాకుండా, ఇతర ప్రయాణికుల భద్రతకూ ముప్పుగా నిలిచే ఇలాంటి ఘటనలపై రైల్వే శాఖ ఎంతవరకు చర్యలు తీసుకుంటుందన్నది ప్రశ్నార్థకంగా మారింది. ఇప్పటికే రైళ్లలో డోర్ల వద్ద నిలబడడం నిషేధంగా ఉన్నా, సోషల్ మీడియా పాపులారిటీ కోసం కొంతమంది యువత గడ్డు నిర్ణయాలు తీసుకుంటున్నారు. ప్రభుత్వం, రైల్వే అధికారులు ఇలాంటి ఘటనలను అడ్డుకునేందుకు ప్రత్యేక దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని భద్రతా నిపుణులు సూచిస్తున్నారు.