President Droupadi Murmu: శీతాకాలం విడిది కోసం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఇవాళ హైదరాబాద్ రానున్నారు. మధ్యాహ్నం 2.25 గంటలకు హైదరాబాద్లోని హకీంపేట ఎయిర్ పోర్టుకు ప్రత్యేక విమానంలో ఆమె చేరుకోనున్నారు. డిసెంబంర్ 17 నుంచి 22వ తేదీ వరకు అంటే.. మొత్తం ఐదు రోజుల పాటు బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో ద్రౌపది ముర్ము బస చేయనున్నారు.
పలు కార్యక్రమాల్లో పాల్గొననున్న రాష్ట్రపతి
రాష్ట్రపతి ముర్ము హైదరాబాద్ విడిది సందర్భంగా పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. ఇందుకు సంబంధించిన సెక్యూరిటీ ఏర్పాట్లు చేస్తున్నారు. డిసెంబర్ 19న రామోజీ ఫిలిం సిటీకి వెళ్లనున్నారు. ఆ రోజు ఉదయం 11.00 గంటలకు ఈ ఫిలిం సిటీ వేదికగా జరగనున్న ఆల్ ఇండియా పబ్లిక్ సర్వీస్ కమిషనర్ల జాతీయ సదస్సును రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రారంభించనున్నారు. అనంతరం కీలక ఉపన్యాసం చేయనున్నారు. అటు డిసెంబర్ 20వ తేదీన గచ్చిబౌలిలోని శాంతి సరోవర్లో జరిగే సదస్సుకు ముర్ము హాజరవుతారు.
భారీ భద్రతా ఏర్పాట్లు చేసిన అధికారులు
హైదరాబాద్లో రాష్ట్రపతి పర్యటన నేపథ్యంలో భద్రతా ఏర్పాట్లపై ఇప్పటికే ప్రభుత్వం సమీక్ష నిర్వహించింది. సైబరాబాద్ పరిధిలో డ్రోన్లు ఎగురవేతపై పోలీసులు ఆంక్షలు విధించారు. అలాగే అల్వాల్, గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ల పరిధిలో 17నుంచి 22 వరకు డ్రోన్లు, పారా గ్లైడర్లు, రిమోట్ కంట్రోల్డ్ మైక్రో లైట్ ఎయిర్క్రాఫ్టుల ఎగురవేతపై నిషేధం విధించారు. భద్రతా చర్యల్లో భాగంగా బిఎన్ఎస్ఎస్ సెక్షన్ 163 కింద పోలీస్ ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. బొల్లారం మార్గంలోని కొన్ని ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.





