జాతీయం

Karnataka Politics: కలిసి టిఫిన్ చేశారు ఓకే, ఇకపై కలిసే ఉంటారా?

కర్నాటక రాజకీయం మొత్తానికి సర్దుమణిగింది. సీఎం, డిప్యూటీ సీఎం కలిసి బ్రేఫాస్ట్ చేసి, కలిసే ఉన్నాం అనే సంకేతం ఇచ్చారు.

Siddaramaiah- DK Shivakumar Breakfast Diplomacy : కర్ణాటక రాజకీయాల్లో గత కొద్ది రోజులుగా జరుగుతున్నగందరగోళానికి తెరపడింది. సీఎం సిద్దరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌ ఇద్దరూ ఒకేచోట కలిసి బ్రేక్ ఫాస్ట్ చేశారు. పలు అంశాలపై చర్చించారు. తామిద్దరం కలిసే ఉన్నామని చెప్పారు.

సీఎం ఇంటికి వెళ్లే బ్రేక్ ఫాస్ట్ చేసిన శివకుమార్

డిప్యూటీ సీఎం డీకే శివకుమార్..  సీఎం సిద్ధరామయ్య అధికారిక నివాసానికి వెళ్లి అక్కడే అల్పాహారం చేశారు. ఈ సందర్భంగా ఇద్దరు నేతలు సుమారు అరగంటకుపైగా మాట్లాడుకున్నారు. అనంతరం సీఎం, డీసీఎం కలిసి మీడియా ముందుకు వచ్చారు. తమ మధ్య ఎలాంటి భేదాభిప్రాయాలు లేవని, ఇకముందు కూడా ఉండబోవని సిద్దరామయ్య స్పష్టం చేశారు. నాయకత్వ మార్పునకు సంబంధించి ఇకపై ఏ విభేదాలు ఉండవని చెప్పారు. తాము ఐక్యంగానే ఉన్నామని, 2028 ఎన్నికల్లో కాంగ్రెస్‌ గెలుపే లక్ష్యంగా పనిచేస్తామని తెలిపారు. అధిష్ఠానం తీర్మానానికి అనుగుణంగా నడుచుకుంటామని, అల్పాహార విందులోనూ అదే తీర్మానించామని వివరించారు.

నాయకత్వం మార్పు వార్తలు మీడియా సృష్టి

నాయకత్వం మార్పుపై కొన్ని మీడియాల ద్వారానే ఎక్కువగా చర్చ జరిగిందన్నారు సిద్ధరామయ్య. మరో వారం రోజుల్లో జరగనున్న అసెంబ్లీ సమావేశాల్లో బీజేపీ-జేడీఎస్‌ అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడితే దీటుగా ఎదుర్కొంటామని సీఎం చెప్పారు.  ప్రజల మద్దతుతో రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చిందని, వారికి ఇచ్చిన హామీలకు అనుగుణంగా పనిచేస్తున్నామని డీకే శివకుమార్‌ చెప్పారు. సిద్దరామయ్య నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పడిందని, రాజకీయంగా ఇద్దరిదీ ఒకే తీర్మానమని చెప్పారు. హైకమాండ్‌ చెప్పినట్లుగానే కలసి ముందుకెళ్తామని తెలిపారు. తాను గ్రూపులకు అవకాశం ఇవ్వనని, నాయకత్వం విషయంలోనూ అధిష్ఠానం ఆదేశాలను పాటిస్తానని స్పష్టం చేశారు. 2028లోనూ గత ఫలితాలే పునరావృతం అవుతాయని డీకే దీమా వ్యక్తం చేశారు. కర్ణాటకలో సీఎం మార్పు అంశంపై కొద్దిరోజులుగా చర్చ జరుగుతున్న నేపథ్యంలో.. కాంగ్రెస్‌ అధిష్ఠానం రంగంలోకి దిగి శివకుమార్‌ను సిద్దరామయ్య దగ్గరకు వెళ్లి కలవాలని, తద్వారా ఇద్దరూ కలిసే ఉన్నారన్న సంకేతం ఇవ్వాలని, ఊహాగానాలకు తెరదించాలని ఆదేశించింది.

Back to top button